రూ.2 లక్షల రుణమాఫీకి క్రైటేరియా ఫిక్స్.. రూ.15 వేల కోట్లు సేవ్ చేసేలా రేవంత్ సర్కార్ ప్లాన్..!

గత ఐదేళ్లలో రూ.2 లక్షల లోపు రుణం తీసుకున్న రైతుల వివరాలను వ్యవసాయశాఖ సేకరించి రెడీగా పెట్టుకున్నది.

Update: 2024-06-14 02:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గత ఐదేళ్లలో రూ.2 లక్షల లోపు రుణం తీసుకున్న రైతుల వివరాలను వ్యవసాయశాఖ సేకరించి రెడీగా పెట్టుకున్నది. ఆ వివరాలను త్వరలో జరిగే మంత్రివర్గం సమావేశంలో అగ్రికల్చర్ శాఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనుంది. అసలైన రైతులు తీసుకున్న రుణం ఎంత..? ఉద్యోగస్తులు, ఐటీ పేయర్స్ తమ భూములకు తీసుకున్న రుణం ఎంత..? అలాగే ప్రజాప్రతినిధులు తీసుకున్న రుణాలు ఎన్ని..? అనే కోణంలో సమాచారాన్ని సిద్ధం చేశారు. అయితే రాష్ట్రంలో కేంద్రం అందిస్తోన్న పీఎం కిసాన్ సమ్మాన్ స్కీమ్ కింద లబ్ధిపొందుతోన్న రైతుల వివరాలను లెక్కలు తీశారు. కేవలం వారికే రుణమాఫీ చేస్తే ఎంత ఖర్చు అవుతుందోనని కోణంలో కూడా రిపోర్టులు తయారు చేశారు.

కేబినెట్ ముందుకు రుణాల వివరాలు

రెండు మూడురోజుల్లో కేబినెట్ సమావేశం కానుంది. ఆ సమావేశంలో రైతులు తీసుకున్న రుణాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వ్యవసాయ శాఖ వివరించనుంది. రైతులు తీసుకున్న రుణాలపై అధికారులు మూడు నాలుగు కోణాల్లో విడివిడిగా రిపోర్టులు రెడీ చేశారని సమాచారం. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తోన్న రైతులు తీసుకున్న రుణాలపై విడిగా ఓ రిపోర్టు తయారు చేశారని తెలిసింది.

అలాగే ఐటీ పేయర్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వ్యవసాయం కోసం తీసుకున్న రుణం ఎంత..? అనే కోణంలో మరో రిపోర్టు తయారు చేశారని వ్యవసాయ వర్గాల్లో ప్రచారం ఉంది. ప్రతి కుటుంబంలో ఎంత మంది పేర వ్యవసాయ భూములు ఉన్నాయి..? అందులో ఎంత మంది రుణాలు తీసుకున్నారు..? అనే వివరాలతో మరో రిపోర్టు రెడీ చేశారని తెలిసింది. ఈ వివరాలను మంత్రివర్గ సమావేశానికి వివరించి, ఏ విధంగా రుణమాఫీ చేయాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు.

రూ. 15 వేల కోట్లు ఆదా

పీఎం కిసాన్ సమ్మాన్ తరహాలో రుణమాఫీ స్కీమ్ అమలులో షరతులు విధిస్తే ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందోనని వ్యవసాయ లెక్కలు తీసినట్టు తెలిసింది. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పీఎం కిసాన్ సమ్మాన్ కింద ప్రతి ఏటా 32.68 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. కేవలం వీరికి రైతు రుణమాఫీ చేస్తే ప్రభుత్వానికి సుమారు రూ.15 వేల కోట్ల ఆదా అవుతుందని సెక్రెటేరియట్ వర్గాల్లో ప్రచారం ఉంది. ఎలాంటి షరుతులు లేకుండా రూ.2 లక్షల రుణం తీసుకున్న రైతులందరికి రుణమాఫీ వర్తింపజేస్తే దాదాపు రూ.33 వేల కోట్ల నుంచి రూ.38 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందునని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు.

ఫ్యామిలీ యూనిట్‌గా రుణమాఫీ..?

ఫ్యామిలీ యూనిట్‌గా తీసుకుని రుణమాఫీ చేస్తే ఎలా ఉంటుంది..? అనే కోణంలో కూడా చర్చలు జరుపుతున్నది. ఒకవేళ ఫ్యామిలీ యూనిట్‌గా తీసుకుని రుణమాఫీ చేస్తే(భార్యభర్తలు, పెళ్లి కాని పిల్లలు తీసుకున్న రుణంలో ఒక్కరికే ప్రయోజనం) ఎంత మేరకు ఖర్చు అవుతుంది..? అనే యాంగిల్‌లో కూడా వివరాలు రెడీ చేశారని సమాచారం. అయితే కేంద్రం అందిస్తోన్న పీఎం కిసాన్ సమ్మాన్ స్కీమ్‌ను ఫ్యామిలీ యూనిట్‌గా తీసుకుని అమలు చేస్తున్నారు. అదే తరహాలో రాష్ట్రంలో రుణమాఫీ చేస్తే వచ్చే లాభనష్టాలపై కూడా చర్చిస్తున్నట్టు తెలిసింది.

డిసెంబర్ 7 కటాఫ్ డేట్..!

రుణమాఫీ అమలుకు ఏ తేదీని ప్రామాణికంగా తీసుకోవాలనే అంశంపై పార్టీలో పలు రకాల అభిప్రాయాలున్నాయి. 2023 డిసెంబర్ 7న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. ఆ తేదీలోపు రూ.2 లక్షల రుణం తీసుకున్న రైతులు అందరికి మాఫీ చేస్తే ఎలా ఉంటుంది..? డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టిన రోజు. ఆ రోజును కటాఫ్ డే‌గా పెట్టుకుని స్కీమ్ అమలు చేస్తే ఎలా ఉంటుంది..? అనే కోణంలో చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. ఆ రెండు డేట్స్ కాకుండా పార్టీ పరంగా ఇంకా ఏమైనా ముఖ్యమైన తేదీలు ఉన్నాయా..? అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నట్టు ప్రచారం ఉంది.


Similar News