KTR : రైతు భరోసా ఇచ్చే వరకు కాంగ్రెస్‌ను వదిలేది లేదు.. మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరిక

కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాం రాం చెబుతున్నారన్న కేసీఆర్ మాటలను రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.

Update: 2024-10-19 09:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాం రాం చెబుతున్నారన్న కేసీఆర్ మాటలను రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. వానాకాలం పంట సీజన్‌ కు రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టేసిందని, లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టిందన్నారు. రేపు, మాపు అంటూ నెట్టుకొస్తున్నప్పుడే ఈ ప్రభుత్వం మీద అనుమానం కలిగిందని, ఇప్పుడు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు చేతులేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. మీ చేతగానితనం తో రైతన్నలను మోసం చేస్తామంటే ఊరుకునేలేదని, సబ్ కమిటీ, గైడ్ లైన్స్ అంటూ పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడతామంటే రైతులు మిమ్మల్ని వదిలిపెట్టరని పేర్కొన్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా రైతును ఏడిపిస్తున్న కాంగ్రెస్ కు వారి ఉసురు తప్పదన్నారు. రైతు భరోసాకు డబ్బులు లేకపోవటంతోనే సబ్ కమిటీ అంటూ డ్రామాలు స్టార్ట్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ పదివేలు ముష్టి వేస్తున్నాడు.. మేము రూ. 15 వేలు ఇస్తామన్న సిపాయి ఎక్కడ? అని ప్రశ్నించారు. పేదల ఇండ్లను, జీవితాలను పడగొట్టి రూ. లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణకు డబ్బులుంటాయా? మీరు చెప్పినట్లు రైతులకు ఎకరానికి రూ. 7500 ఇచ్చేందుకు పైసలు లేవా? అని నిలదీశారు. పచ్చి అబద్ధాలు, మోసాలతో రైతులను దగా చేశారని, నీ దగాకోరు మాటలు నమ్మి గెలిపించిన రైతులను అరిగోస పెడుతున్నారన్నారు. రుణమాఫీ మోసం చాలదన్నట్లు ఇప్పుడు రైతు భరోసాలోనూ దగానే అని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందేనని తెలిపారు. లేదంటే ఎక్కడికక్కడ మీ ప్రజాప్రతినిధులను ప్రజలే నిలదీస్తారని హెచ్చరించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, రైతు భరోసా ఇచ్చే వరకు కాంగ్రెస్‌ను వదిలేది లేదని ప్రకటించారు.


Similar News