బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్"

బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Update: 2024-10-28 17:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్(Former minister Srinivas Goud) డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశాన్ని పరిపాలించిందే కాంగ్రెస్,బీజేపీ పార్టీలు అని, ఇప్పుడు ఓబీసీ కులగణన గుర్తుకు వచ్చిందా? అని నిలదీశారు. బ్రిటిష్ కాలంలో కులగణన జరిగిందన్నారు. 65 శాతం ఉన్న ఓబీసీల కులగణన ఎంతో తెలియదని, కులగణన జరిగితే ప్రభుత్వాలపై తిరుగుబాటు వస్తుందని భయపడ్డారన్నారు. కులగణన చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. బీహార్,మహారాష్ట్ర ఓబీసీ కులగణన చేస్తామంటే కేంద్రం ఒప్పుకోలేదన్నారు. ఓబీసీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

బీహార్ లో 63.1 శాతం ఓబీసీలు ఉన్నట్లుగా కులగణనలో తేలిందన్నారు. మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని కోరారు. కులగణన చేసే అధికారం రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిందని, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిందన్నారు. బీసీ డిక్లరేషన్ వలన బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణనపై ముందుకు వెళ్ళాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల విషయంలో ఏదో సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేయవద్దు అని కోరారు.


Similar News