CM Revanth: ఎఫ్‌టీఎల్ పరిధిలో భవనాల కూల్చివేత నా బాధ్యతే: సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ పునర్‌నిర్మాణమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

Update: 2024-09-11 06:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పునర్‌నిర్మాణమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన సబ్ ఇన్‌స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కని పెంచిన తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేలా యువత సక్రమమైన దారిలో నడవాలని ఆకాంక్షించారు. ఉద్యోగాల కల్పనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, TGPSCలో అక్రమాలకు తావు లేకుండా ఆ సంస్థను ఇప్పటికే పూర్తిగా ప్రక్షాళన చేశామని తెలిపారు.

ఈ ఏడాదిలోనే మరో 35 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెలవేరలేదని అన్నారు. తమ ప్రభుత్వ పని తీరుపై యువకులకు ఎలాంటి అనుమానాలు, అపోహలు అక్కర్లేదని అన్నారు. కొందరు చెడు వ్యసనాలకు అలవాటు పడి డ్రగ్స్‌ను విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌ (Police Department)లో కొత్తగా చేరిన వారు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి (Drugs,Ganja) వ్యసనాలకు స్థానం ఉండకుండా చేయాలని అన్నారు. ఇప్పటికే 22 లక్షల మంది రైతులకు రుణ‌మాఫీ ( Loan waiver) చేశామని గుర్తు చేశారు. 

గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తనకు రైతుల కష్టాలు పూర్తిగా తెలుసని అన్నారు. ఒకప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ (Usman Sagar, Himayat Sagar) జలశయాలు హైదరాబాద్ నగర వాసుల దాహార్తిని తీర్చేవని అన్నారు. చాలా మంది బడా నేతలు ఫామ్‌హౌజ్‌లు కట్టుకుని వ్యర్థాలను గండిపేటలోకి వదులుతున్నారని ఆరోపించారు. చెరువుల ఆక్రమణతోనే వరదలు నగరాలను ముంచెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఇక ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలో ఉన్న భవనాల కూల్చివేత తన బాధ్యతేనని అన్నారు. హైదరాబాద్ వ్యర్థ జలాలు నల్లగొండ జిల్లా (Nalgonda District)ను ముంచెత్తుతున్నాయని తెలిపారు. అందుకే తమ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనను చేపట్టిందని సీఎం అన్నారు.


Similar News