CM Revanth: గ్రీన్ ఫార్మా సిటీపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో గ్రీన్ ఫార్మా సిటీపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది.
దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి పనులపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఆ అంశంపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముచ్చెర్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే పలు కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని గుర్తు చేశారు. అదేవిధంగా పూర్తిగా కాలుష్య రహితంగా ఉండేలా ఫార్మా సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, అవసరం అయితే సరికొత్త టెక్నాలజీని వాడుకోవాలని పేర్కొన్నారు. సిటీ డెవలప్మెంట్కు కావాల్సిన రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పించి పెట్టుబడులను ఆకర్షించేలా ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఔషధ తయారీ కంపెనీలు, బయోటెక్ అండ్ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కొత్తగా నెలకొల్పే అత్యాధునిక గ్రీన్ ఫార్మా సిటీ సింగిల్ స్టాప్గా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు, సీఎస్ శాంతి కుమారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు.