బీఆర్ఎస్ రెండు నాల్కల ధోరణిలో మాట్లాడుతోంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దామగుండం రాడార్ సెంటర్‌పై బీఆర్ఎస్ రెండు నాల్కల ధోరణిలో వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.

Update: 2024-10-15 06:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: దామగుండం రాడార్ సెంటర్‌పై బీఆర్ఎస్ రెండు నాల్కల ధోరణిలో వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ రాడార్ సెంటర్ ఏర్పాటుకు 2017 డిసెంబర్ 12నే నేవల్ రాడార్ సెంటర్‌కు అనుమతులు వచ్చాయని, జీవో 44ను విడుదల చేసింది కూడా అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. దామగుండం రాడార్ స్టేషన్ ప్రాజెక్ట్ దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్ట్ అని, ఈ ప్రాజెక్ట్ విషయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలోకి వచ్చాక ఒకలా మాట్లాడుతోందని మండిపడ్డారు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్‌కు బీఆర్ఎస్ ల్యాండ్ ఎలాట్ చేయడంతో ఆలస్యం కావడం వల్లే ప్రాజెక్ట్ కూడా లేట్ అయిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భూమి కేటాయించడంతో ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నామని చెప్పారు. అలాగే ఈ రాడార్ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రానికే మంచి పేరు వస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఈ రాడార్ కేంద్రం ఏర్పాటు చేయడం కోసం దామగుడం అడవుల్లో 2900 ఎకరాల అటవీ భూములను తెలంగాణ సర్కార్ నేవీకి అప్పగించింది. ఈ భూముల్లో 93 వేల చెట్లతో పాటు 400 ఎకరాల్లో గడ్డి భూములు ఉన్నాయి. వీటన్నింటినీ తొలగిస్తే.. పర్యావరణం దెబ్బతింటుందని, అటవీ వ్యవస్థ పూర్తిగా నాశనమవుతుందంటూ బీఆర్ఎస్‌తో పాటు స్థానికులు, పర్యావరణ వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టడానికి వీల్లేదని మండిపడుతున్నారు. అయితే ఈ వ్యతిరేకత మధ్యే ఈ రోజు (మంగళవారం) ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 

Read More : ప్రభుత్వ నిర్ణయంతో దామగుండం అడవికి ముప్పు..కళ్లముందే ప్రకృతి నాశనం అవుతున్నా ఆపేదెవరు?​ నేవీ రాడార్ స్టేషన్‌తో 12 లక్షల చెట్లు నరికివేత!


Similar News