రైస్ మిల్ సిబ్బందిపై BRS ఎమ్మెల్యే గంప గోవర్ధన్ దాడి (వీడియో)

కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తీరు వివాదస్పదమైంది. ధాన్యం విషయంలో రైస్ మిల్లు సిబ్బందిపై ఆయన చేయి చేసుకున్నారు.

Update: 2023-05-06 12:24 GMT

దిశ, నిజామాబాద్ ప్రతినిధి: కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తీరు వివాదస్పదమైంది. ధాన్యం విషయంలో రైస్ మిల్లు సిబ్బందిపై ఆయన చేయి చేసుకున్నారు. దీంతో రైస్ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బేషారుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా కామారెడ్డి జిల్లాలో అకాల వర్షం కురిసింది. దీంతో వరి ధాన్యం మొత్తం తడిచిపోయింది. అయితే రైతులు ఈ ధాన్యాన్ని బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలోని పూర్ణిమ రైస్ మిల్లులో దించేందుకు ప్రయత్నించారు. అయితే రైస్ మిల్లులో లోడింగ్, అన్ లోడింగ్ సమస్య ఉందని యాజమాన్యం తెలిపింది. ఈ విషయం కలెక్టర్ జితేశ్ పాటిల్ దృష్టికి చేరడంతో రైస్ మిల్లర్లతో మాట్లాడారు. కచ్చితంగా ధాన్యం దించుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ధాన్యం దించుకునేందుకు మిల్లర్లు ఒప్పుకున్నారు. కొంతసమయం పడుతుందని తెలిపారు.

అయితే, కొందరు రైతులు తమ ధాన్యాన్ని పూర్ణిమ రైస్ మిల్లులో దించుకోనివడం లేదని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన పూర్ణిమ రైస్ మిల్లు వద్దకు వెళ్లారు. ఎందుకు ధాన్యం దించుకోనివ్వరని మిల్లు సిబ్బందిని నిలదీశారు. అయితే వారు చెప్పిన తీరు ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు నచ్చలేదు. ఆగ్రహంతో రైస్ మిల్లు సిబ్బంది చెంప చెళ్లుమనిపించారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై రైస్ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గంపగోవర్ధన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకోగా.. రైస్ మిల్ సిబ్బందిపై ఎమ్మెల్యే గంప గోవర్ధన్ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News