ఇద్దరు బీఆర్ఎస్ నేతల ఏకాంత భేటీ.. ఆయన డైరెక్షన్‌లోనే కేటీఆర్‌కు కౌంటర్

అమృత్ స్కీమ్ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను ఆ పార్టీకే చెందిన మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తప్పుపట్టడం సంచలనంగా మారింది.

Update: 2024-09-26 02:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అమృత్ స్కీమ్ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను ఆ పార్టీకే చెందిన మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తప్పుపట్టడం సంచలనంగా మారింది. అయితే కందాల.. మీడియా సమావేశానికి ముందు బీఆర్ఎస్ కు చెందిన ఓ కీలక నేత ఇంటికి వెళ్లి, గంటపాటు భేటీ అయ్యారని ప్రచారం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఇరువురు ఏం చర్చించుకున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఆయన ఇచ్చిన డైరెక్షన్ లోనే కందాల కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారా? అనే అనుమానాలు గులాబీ లీడర్లలో మొదలయ్యాయి.

కేటీఆర్‌కు దూరంగా కందాల?

కందాల ఉపేందర్ రెడ్డి కొంత కాలంగా కేటీఆర్ తో దూరంగా ఉంటున్నట్టు చర్చ జరుగుతున్నది. ఈ మధ్య కేటీఆర్ పలుసార్లు కందాలకు ఫోన్ చేసినా స్పందించలేదని సమాచారం. కానీ అమృత్ స్కీమ్ విషయంలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ఆరోపణలు చేసిన మరుసటి రోజే కందాల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ కు చెందిన ఓ కీలక నేత ఇంటికి వెళ్లారనే ప్రచారం ఉంది. ఆయనతో గంటపాటు భేటీ అయిన తర్వాతే కందాల మీడియా ముందుకు వచ్చి ‘అమృత్’ స్కీమ్ పై కేటీఆర్ చేసిన ఆరోపణలను తప్పుపట్టారు.

‘కేటీఆర్ చేసిన ఆరోపణలు నిజం కాదు. ఆయనను ఎవరో మిస్ గైడ్ చేవారు. సృజన్ రెడ్డి రేవంత్ కు సొంత బావమరిది కాదు. సృజన్ నా అల్లుడు. ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు. రూల్స్ ప్రకారమే నా అల్లుడి కంపెనీకి టెండర్లు దక్కాయి’ అని మాట్లాడారు. అయితే కందాల సహజంగా మితభాషి, ఎవరితో పెద్దగా చనువుగా ఉండరని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అందుకే మీడియా ముందు ఏం మాట్లాడాలి? ఏఏ విషయాలు ప్రస్తావించాలి? అనే అంశాలపై సదరు లీడర్ కందాలకు గైడెన్స్ ఇచ్చి ఉంటారేమోనని చర్చ జరుగుతున్నది.


Similar News