BRS: మాటిచ్చి బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే ఎలా..? కేటీఆర్ ట్వీట్

అన్ని రంగాల్లో వైఫల్యం.. అన్ని వర్గాల్లో ఆగ్రహం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Update: 2024-10-23 09:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అన్ని రంగాల్లో వైఫల్యం.. అన్ని వర్గాల్లో ఆగ్రహం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై స్పందించిన ఆయన.. ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్.. సకల జనులను దగా చేసింది కాంగ్రెస్ సర్కారు అని, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు సమాజంలోని ప్రతి సెక్షన్ ఆందోళన బాటలోనే వున్నారని తెలిపారు. అలాగే ఐదు డీఏలు పెండింగ్‌లో వుంచడం ఏంటని, ఇంత అన్యాయం ఎప్పుడైనా వుందా అని నిలదీశారు. కనీసం కలిసి మాట్లాడటానికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా.. ఉద్యోగ సంఘాలను అవమానించడం భావ్యమా అంటూ విన్నపాలు వినే తీరికకూడా లేదా ఈ ముఖ్యమంత్రికి అని ప్రశ్నించారు.

కొత్త పీఆర్‌సీ వేసి ఆరు నెలల్లోనే సిఫారసులు అమలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది వాస్తవం కాదా అని, 11 నెలలు గడిచినా రెండో సీఆర్సీ నివేదికను ఎందుకు తెప్పించుకోలేదని అడిగారు. సీపీఎస్‌ రద్దు చేసి, ఓల్డ్ పెన్షన్ స్కీం తిరిగి తెస్తామని మాటిచ్చి, ఇప్పుడు బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే ఎట్లా అని, తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషించిన ఉద్యోగ వర్గాల సమస్యలను పట్టించుకోకపోవడం కాంగ్రెస్‌ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. నెలల తరబడి జీతాల్లేక చిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది అల్లాడిపోతున్నారని, ఆశాలు.. అంగన్ వాడీలకు ఇచ్చిన హామీలకు దిక్కుమొక్కు లేదని ఆరోపించారు. ఇక ఏఈవోల పనిభారం బాధ, ఆవేదన వినకుండా వందల మందిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం దుర్మార్గమని, ఉద్యోగుల మీద కక్ష కట్టడం మంచిది కాదని, వాళ్ల సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. 


Similar News