కేసీఆర్‌కు పట్టిన గతే.. CM రేవంత్‌కు పడుతుంది: BJYM స్టేట్ చీఫ్ మహేందర్

రాష్ట్రంలో పరిస్థితులు మరో ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, నిరుద్యోగ సమస్యలపై నిరసనకు దిగితే ముందస్తు అరెస్టులు చేసి

Update: 2024-07-05 17:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పరిస్థితులు మరో ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, నిరుద్యోగ సమస్యలపై నిరసనకు దిగితే ముందస్తు అరెస్టులు చేసి అడ్డుపడుతున్నారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము శాంతియుతంగా టీజీపీఎస్సీ ఎదుట నిరసన చేయాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం పోలీసుల అండతో అణచివేయాలని చూస్తోందని మండిపడ్డారు. బీజేవైఎం కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్టు చేసి దాడులు చేస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట భారీగా పోలీసులను మోహరింపజేయడంతో యుద్ధ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. బాహుబలి సినిమాలోలా టీజీపీఎస్సీ చుట్టూ కంచెలా వేసి నిరుద్యోగులను కాలేకేయులుగా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని విరుచుకుపడ్డారు.

తామంతా నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్నామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నామని మహేందర్ తెలిపారు. ఎంత అణచివేయాలని చూస్తే అంతకంటే పెద్ద ఎత్తున బీజేవైఎం పోరాటాలకి సిద్ధమవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనడంపైనే శ్రద్ధ ఉందని ఎద్దేవాచేశారు. ఇచ్చిన హామీల అమలుపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మహేందర్ విరుచుకుపడ్డారు. నిరుద్యోగుల అంశంలో కేసీఆర్ నడిచిన దారిలోనే రేవంత్ వెళ్తున్నారని, మాజీ సీఎం కేసీఆర్‌కు పట్టిన గతే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పడుతుందని మహేందర్ పేర్కొన్నారు.


Similar News