మంత్రిగా బాధ్యతలు తీసుకున్న భట్టీ.. కీలక ఫైళ్లపై మొదటి నాలుగు సంతకాలు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర సచివాలయంలో ఉదయం 8:21 గంటలకు తన చాంబర్లో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, ఆశీర్వచనాల మధ్య ఆర్థిక ఇంధన ప్రణాళిక మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు.

Update: 2023-12-14 06:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర సచివాలయంలో ఉదయం 8:21 గంటలకు తన చాంబర్లో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, ఆశీర్వచనాల మధ్య ఆర్థిక ఇంధన ప్రణాళిక మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎంకి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ట్రాన్స్కో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శులు శ్రీదేవి, హరిత తదితర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, సంజీవరెడ్డి, బీర్ల ఐలయ్య, రాగమయి, మల్ రెడ్డి రంగారెడ్డి, నాగరాజు, షబ్బీర్ అలీ, తదితరులు హాజరయ్యారు.

మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారెంటీలకు సంబంధించిన నిధులను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతకం చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలి సంతకం చేశారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు విడుదల చేస్తూ రెండో సంతకం చేశారు. అలాగే విద్యుత్ సబ్సిడీ 996 కోట్ల రూపాయలు విడుదల ఫైళ్లపై భట్టి మూడో సంతకం చేశారు. వీటితో పాటుగా సమ్మక్క సారక్క జాతర ఏర్పాటు కొరకు 75 కోట్ల రూపాయలు వివిధ శాఖల మంజూరుకు సిఫారసు చేసిన ఫైలుపై సంతకం చేశారు.


Similar News