'గోమాతను వధిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా?'.. ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక

బక్రీద్ సందర్భంగా ధర్మపురిలో పట్టపగలే అందరూ చూస్తుండగా గోమాతను వధించిన కేసులో బాధ్యుడైన కౌన్సిలర్‌పై కేసు నమోదు

Update: 2023-06-30 16:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బక్రీద్ సందర్భంగా ధర్మపురిలో పట్టపగలే అందరూ చూస్తుండగా గోమాతను వధించిన కేసులో బాధ్యుడైన కౌన్సిలర్‌పై కేసు నమోదు చేయకపోగా పోలీసులు చూస్తూ ఊరుకుంటారా..? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా దుర్మార్గమని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోగా, ఆందోళన చేసిన వారినే అరెస్ట్ చేయడం అన్యాయమని శుక్రవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. గోమాతను వధించడాన్ని నిరసిస్తూ ధర్మపురి ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించడం హర్షణీయమని, స్వచ్ఛందంగా బంద్ పాటించిన వారిని పోలీసులు భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం సహించరాని విషయంగా పేర్కొన్నారు.

గోమాతను వధించడం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ చట్టాన్ని అమలు చేయకపోవడం కేసీఆర్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. తాను నిఖార్సయిన హిందువునని పదేపదే చెప్పుకునే కేసీఆర్ ఎందుకు ఈ విషయంపై స్పందించడం లేదని సంజయ్ ప్రశ్నించారు. తక్షణమే అమాయకులపై పెట్టిన నాన్ బెయిలెబుల్ కేసులను ఉపసంహరించుకోవాలని, అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని లేదంటే శనివారం తానే స్వయంగా ధర్మపురికి బయలుదేరుతానని, ఆ తరువాత జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని సంజయ్ హెచ్చరించారు.


Similar News