CM Revanth Reddy: మూసీ ప్రాజెక్టుపై సీఎం మరో సంచలన ప్రకటన.. ఆ రెండు నదులు కలిసే చోట భారీ నిర్మాణం

మూజీ ప్రాజెక్టుపై సీఎం సంచలన ప్రకటన చేశారు.

Update: 2024-10-25 07:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్ ను అభివృద్ధి చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈసా, మూసా నదులు కలిసే చోట బాపూ ఘాట్ ఉందని, అక్కడ గుజరాత్ లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహం మాదిరిగా బాపూ ఘాట్ లో గాంధీజీ విగ్రాహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ వేదికగా ఏబీపీ నెట్ వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ది సదరన్ రైజింగ్ సమ్మిట్' ను సీఎం రేవంమత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడాతూ.. మూసీ పునరుజ్జీవాన్ని చేసి గాంధీ వారసులుగా మేం బాపూ ఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామంటే దీన్ని బీఆరెస్, బీజేపీ ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నాయని ప్రశ్నించారు. మీరు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకోవచ్చు కానీ మేము మూసీ పునరుజ్జీవం చేస్తామంటే మీ బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారెందుకు అని ప్రశ్నించారు. ఎందుకంటే మేము గుజరాత్ కు పోటీ ఇవ్వబోతున్నామని అందువల్లే తెలంగాణను, హైదరాబాద్ ను ఫినిష్ చేయాలని బీజేపీ నేతలు మా ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రాడార్, ఇరిగేషన్ ప్రాజెక్టులతో తెలంగాణ పురోగతి సాధించి గుజరాత్ కు పోటీ ఇస్తుందనే విషయం తెలిసే మా ప్రయత్నాలను ఆపేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రయత్నం చేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ వ్యతిరేకించిన మరుసటి రోజే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడతారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తే సమస్య ఏంటని నిలదీశారు.

సౌత్ స్టేట్స్ పై చిన్నచూపు:

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సౌత్ స్టేట్స్ కు ప్రధాని మోడీ అందించిన సహకారం చాలా తక్కువ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం పెద్దగా నిధులు ఇవ్వకపోయినా ఇక్కడి ఓట్లు కావాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. నార్త్ స్టేట్స్ తో పోలిస్తే సౌత్ స్టేట్స్ ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నా వాటిలో తిరిగి పొందేది మాత్రం చాలా తక్కువ వాటా ఉందన్నారు. కేంద్రానికి మేం ఒక్క రూపాయి పంపిస్తే తిరిగి వెనక్కి వస్తున్నవి కేవలం రూ.40 పైసలు మాత్రమేనన్నారు. అదే యూపీ నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి వెళ్తే రూ.7, బిహార్ కు రూ.6 వెనక్కి వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను దక్షిణాది రాష్ట్రాలు ఆహ్వానిస్తున్నా నిధుల విషయంలో మాత్రం వివక్ష జరుగుతూనే ఉందని విమర్శించారు. ప్రధాని మోడీ ఉత్తర భారత దేశానికి చెందిన వ్యక్తి కావడమే ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడానికి కారణం అని పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే నాకు మద్దతిచ్చారు:

పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన గత సీఎం కేసీఆర్ పది సార్లు కూడా సెక్రటేరియట్ కు రాలేదని ప్రతిపక్ష హోదా ఇస్తే పది నిమిషాలు గవర్నర్ స్పీచ్ లో కూర్చుని వెళ్లిపోయారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ జమీందార్ అని భావిస్తున్నాడని అందుకే బయటరు రావడం లేదని విమర్శించారు. ప్రజలు ఎన్నుకుంటే తాము అధికారంలోకి వచ్చామని మీకు నచ్చకుంటే ఇంట్లో కూర్చోండి. మా ప్రభుత్వాన్ని పని చేయనివ్వండి అన్నారు. మా ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని చూస్తే ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. పార్లమెట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకో కేసీఆర్ ప్రజల ఆలోచనను అర్థం చేసుకోవాలన్నారు. ప్రజల ఆలోచనను పట్టించుకోకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సర్కార్ ను పడగొట్టాలని అనుకున్నారని దాంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే తనకు మద్దతుగా నిలిచారన్నారు.

మోడీ ఏ రెవల్యూషన్ తెచ్చారు?:

నెహు నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ వంటి అనేక మంది కాంగ్రెస్ ప్రధానులు ఈ దేశంలో అనేక సంస్కరణలు, విప్లవాలు తీసుకువచ్చారు. మరి మూడో సారి ప్రధాని అయిన నరేంద్రమోడీ ఈ దేశ ప్రజల కోసం ఏ రెవల్యూషన్ తీసుకువచ్చారని ప్రశ్నించారు. పార్టీలను చీల్చడం, భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం తప్ప మీరు చేసిందేంటని నిలదీశారు. ఈ దేశంలో ఉత్తర, దక్షిణ భారత దేశం అనే విభజన తేవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా నార్త్ వ్యక్తి ప్రధానిగా ఉండే సౌత్ వ్యక్తి రాష్ట్రపతిగా ఉండటం ఆనవాయితీగా ఉండేదన్నారు. కానీ ఆ నియమాన్ని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 


Similar News