సీఎం రేవంత్‌కు హరీష్ రావు మరో బహిరంగ లేఖ

పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, ఇతర సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం

Update: 2024-07-05 16:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, ఇతర సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమానికి అంకురార్పణ చేశారని, ఇందులో భాగంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి చెత్తా చెదారం, మురుగు కాల్వలను శుభ్రపరచడం, పరిసరాల పరిశుభ్రత, ఎవెన్యూ ప్లాంటేషన్‌, నర్సరీ, డంపింగ్‌యార్డుల్లో పిచ్చి మొక్కలు తొలగింపు, వైకుంఠధామాల నిర్మాణం, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు నిర్వహించారన్నారు.

కానీ, ఏడు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్యం కుంటుపడిందన్నారు. గ్రామ పంచాయ‌తీల‌కు న‌యా పైస కూడా విడుద‌ల చేయ‌కుండా నిర్వహణను గాలికి వదిలి వేయడంతో కునారిల్లుతున్నయని, మురికి కూపాలుగా మారుతున్నాయని, చివరకు ట్రాక్టర్లకు డీజిల్ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ సహా అనేక ముఖ్యమైన విధుల్లో నిత్యం శ్రమిస్తున్న గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు జీతాలు అందక ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. దీంతో గ్రామాల్లో చెత్త సేక‌ర‌ణ ఆగిపోయిందని, ట్రాక్టర్ మూల‌న ప‌డిందన్నారు. స్ట్రీట్ లైట్ల నిర్వహణ లేదని, తాగునీటి సరఫరా నిర్వహణ మూలనపడిందన్నారు. ఫాగింగ్ లేదు, చివరకు బ్లీచింగ్ పౌడర్ అందించని దుస్థితి నెలకొందని, దీంతో గ్రామాల్లో విషజ్వరాలు ప్రభలుతున్నాయని, మలేరియా, డెంగీ వంటి వ్యాధుల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా వానాకాలం ప్రారంభంలోనే ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించేది లేదని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలు చేపట్టేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్‌లు పక్కన పెడితే ఉన్న పనులు కూడా చేయడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో పంచాయతీలకు నెల నెలా రూ. 275 కోట్ల జీపీ నిధులు విడుద‌ల చేశామని, మొత్తంగా ఏటా రూ. 3330 కోట్లు ఇచ్చామని, ప‌ట్టణాల పారిశుద్య నిర్వహణ కోసం ప్రతి ఏడాది అదనంగా రూ.1700 కోట్లు ఖ‌ర్చు చేశామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెల‌ల్లో 7 పైస‌లు కూడా విడుదలచేయలేదని మండిపడ్డారు.

ఒక్క పారిశుధ్య కార్మికులకే కాదు.. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సైతం గౌరవ వేతనాలు ఇవ్వని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తామ‌ని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచ‌ర‌ణ‌లో మాత్రం భిన్నంగా వ్యవ‌హ‌రిస్తున్నదన్నారు. చేసిన పనులకు సర్పంచులు గవర్నర్ ను కలిసి బిల్లులు విడుదల చేయాలని మొర పెట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ పాలనలో వచ్చిందన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల నిర్వహణ కోసం బీఆర్ఎస్ చేసిన కృషిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించకపోగా, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు.

ఇప్పటికైనా గ్రామ పంచాయతీ వ్యవస్థను తిరిగి గాడినపెట్టేందుకు కృషి చేయాలని, అందుకు గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, పారిశుధ్య కార్మికులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని, చేసిన పనులకు సర్పంచులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాలు, పట్టణాల్లో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి, పారిశుధ్యం పెంపొందించాలని కోరారు.


Similar News