Bhatti : కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా.. ఎల్ఎస్ బీసీ సమీక్షలో భట్టి విమర్శలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు.

Update: 2024-09-20 12:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే రెండేళ్లలో ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండ, నాగర్ కర్నూల్ జిల్లాలను సస్యశ్యామలం చేయడంతో పాటు నక్కలగండి, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో నెల నెల నిధులు కేటాయించి పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించిన ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో ఒక్క కిలోమీటర్ కూడా కూడా తవ్వకుండా శ్రీశైలం సొరంగ మార్గాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. నెలకు 400 మీటర్లు చొప్పున సొరంగం తవ్వితే ఎస్ఎల్ బీసీకి రూ.14 కోట్లు నిధులు అవసరమవుతాయని 20 నెలల్లో ప్రాజెక్టు పూర్తి కావడానికి అవకాశం ఉందని చెప్పారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకుందని భట్టి చెప్పారు. ఆరు నెలలు, ఏడాది, రెండు, ఐదు సంవత్సరాలలో పూర్తయ్యే ప్రాజెక్టులను గుర్తించి ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించామన్నారు. ముందుగా పూర్తయ్యే ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

గత పాలకుల నిర్లక్ష్యం వల్లే..

రూ.1000 కోట్ల బడ్జెట్ తో పూర్తి కావాల్సిన ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టు వ్యయం గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా రూ.4 వేల కోట్లకు పెరిగి రాష్ట్ర ఖజానాపై పెను భారంగా మారిందని డిప్యూటీ సీఎం ఆరోపించారు. గతంలో సీఎల్పీ నేతగా నేను, పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్, ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్, కోమటిరెడ్డి సొరంగ మార్గం పూర్తికి ఆనాటి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి పోరాటం చేసినా పట్టించుకోలేదన్నారు. గోదావరిపై లక్ష కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కడితే అది కాస్త కుంగిపోయిందనన్నారు. కృష్ణానదిపై దృష్టి పెట్టకపోవడంతో పాలమూరు పూర్తి చేయలేదు.. నీళ్ల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అటు గోదావరి ఇటు కృష్ణ నుంచి గత పది ఏళ్లలో ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే ఈ రాష్ట్రం సస్యశ్యామలమయ్యేదన్నారు. అప్పటికే పనులు ప్రారంభమైన ఉన్న ప్రాజెక్టును వదిలేసి రీ డిజైన్ల పేరిట గత ప్రభుత్వం లక్షల కోట్లు దోపిడీ చేసిందని ధ్వజమెత్తారు. ఫలితంగా రాష్ట్ర ఖజానా దివాలా తీసి ఏడు లక్షల కోట్ల మేర అప్పులు పేరుకుపోయాయన్నారు.

కార్యకర్తలకు భట్టి సూచన..

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చేస్తున్న పనులను నాయకులు, కార్యకర్తలు గడపగడపకు తీసుకెళ్లాలని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా సూచించారు. సబ్ స్టేషన్లు, ఇతర విద్యుత్తు అవసరాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఇచ్చే ప్రతిపాదనలను పరిశీలించి విద్యుత్ అధికారులు వెంటనే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. నీళ్ల కోసమే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ ఆ ఆకాంక్ష నెరవేరలేదన్నారు. ఆ బాధతోనే గత ఏడాది మండుటెండల్లో మార్చి నుంచి జూలై వరకు నాలుగు నెలల పాటు రాష్ట్రంలో పాదయాత్ర చేశానని.. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా అన్ని ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లి లెక్కలతో సహా రాష్ట్ర ప్రజలకు వివరించానన్నారు. ఆ క్రమంలో ఎస్ఎల్బీసీ దగ్గరకు సైతం వచ్చి రాబోయో ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడే కూర్చొని సమీక్ష చేసి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పానని చెప్పినట్లుగానే చేస్తున్నామన్నారు.


Similar News