సింగరేణిలో ముంచుకొస్తున్న తెల్లదొరల కాలం..?

సింగరేణి కాలరీస్ లో ఇటీవల మహిళా ఉద్యోగుల రిక్రూట్మెంట్

Update: 2024-10-01 12:34 GMT

దిశ,బెల్లంపల్లి: సింగరేణి కాలరీస్ లో ఇటీవల మహిళా ఉద్యోగుల రిక్రూట్మెంట్ పెరిగిపోయింది. డిపెండెంట్ ప్రాతిపదికన మహిళలు సింగరేణిలో అరంగేట్రం చేస్తున్నారు. మహిళా ఉద్యోగులకు సర్ఫేస్ లో వివిధ విభాగాల్లో విధులు కల్పిస్తున్నారు. అయితే సంవత్సర కాలంగా సింగరేణి యాజమాన్యం మహిళా ఉద్యోగులను సింగరేణి నుంచి ఉద్వాసన పలికేందుకు ఆదిలోనే కుట్రలకు దొంగచాటుగా కసరత్తు చేస్తుందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మహిళా ఉద్యోగుల రిక్రూట్మెంట్ ను నిలువరించే ప్రధాన ఉద్దేశంతో మహిళా ఉద్యోగులను అండర్ గ్రౌండ్ లో దింపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సింగరేణి వ్యాప్తంగా యాజమాన్యం ఈ అంశంపై అంతర్గత సమాలోచనలు జరుపుతున్నదని సమాచారం.

మహిళా ఉద్యోగులను అండర్ గ్రౌండ్ లో దింపాలనే సర్కులర్ పొరపాటున గతంలో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. వెంటనే యజమాన్యం జాగ్రత్త పడింది.అట్టి సర్క్యులర్ ను ఎక్స్పోజ్ కాకుండా చర్యలు తీసుకుంది. కీలకమైన ఈ విషయాన్ని కార్మిక సంఘాలు తెలిసీ కూడా పట్టించుకోలేదు. మహిళా ఉద్యోగాల ఎసరుకు అదును కోసం సింగరేణి యాజమాన్యం చూస్తోoదనడాకి సర్క్యూలరే నిదర్శనం.కాగా సర్క్యులర్ ఇంప్లిమెంటేషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. మహిళా ఉద్యోగులను అండర్ గ్రౌండ్ లో పని చేపించాలనే సర్క్యూలర్ సింగరేణిలో అప్పట్లో కలకలం రేపింది.

పొమ్మన లేక పొగబెట్టడమే...

అయితే ఇటీవల డిపెండెంట్ మహిళ ఉద్యోగుల నియామకాలు విరివిగా సింగరేణిలో పెరిగిపోయాయి. మహిళా ఉద్యోగుల రిక్రూట్మెంట్ ను సింగరేణి యాజమాన్యం ఎలాగైనా తగ్గించడంపై దృష్టి పెట్టినట్టు సమాచారం. మహిళా ఉద్యోగులను పొమ్మన లేక పొగ పెట్టినట్లు అండర్ గ్రౌండ్ లో దించేందుకు సమా యతమవుతోన్నట్లు తెలుస్తోంది. మహిళలు అండర్ గ్రౌండ్ లో పనిచేయడం అనేది ఎంతటి కష్టసాధ్యమో ఊహించనిది కాదు. అండర్ గ్రౌండ్ లో మహిళలకు రక్షణ పరమైన సమస్యలు ప్రధానంగా ఉంటాయి. ఈ విషయం యజమాన్యానికి తెలియనిది కాదు. సర్ఫేస్ రంగాల్లోనే పనిచేస్తున్న మహిళలకు రకరకాల ఇబ్బందులు, ప్రధానంగా లైంగిక వేధింపులు నిత్యకృత్యం. అలాంటిది మహిళలను అండర్ గ్రౌండ్ లో దింపడం వల్ల వారికి పూర్తిగా రక్షణ లేకుండా పోతుంది. అండర్ గ్రౌండ్ లో మహిళలతో పని చేపించడం ఏ రకంగా సరికాదు. సింగరేణి వ్యాప్తంగా బెల్లంపల్లి, మందమర్రి , శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, రామగుండం, మణుగూరు, భూపాలపల్లి, ఎల్లందు, కొత్తగూడెం తో పాటు వివిధ డిపార్ట్మెంట్లు, జిఎం ఆఫీసుల్లో సుమారుగా 4000 మంది మహిళా కార్మికులు వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్నారు.

బదిలీవర్కర్ స్థాయిలోని మహిళలను మాత్రమే అండర్ గ్రౌండ్ లో దింపేసి వారి ఉద్యోగాలకు ఎసరు పెట్టేందుకు సింగరేణి యాజమాన్యం ముహూర్తం కోసం వెతుకుతున్నదని కార్మిక లోకo ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మహిళల పట్ల మానవత్వం చూపాల్సిన బాధ్యతను సింగరేణి యాజమాన్యం విస్మరిస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భర్తలు కోల్పోయి ఉద్యోగ బాధ్యతలను చేపట్టిన ఎంతో మంది మహిళలు, డిపెండెంట్ ఉద్యోగాలతో కుటుంబాలను పోషిస్తున్నారు. మారిన పరిస్థితిలో కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకున్న మహిళల ఉద్యోగాలకు సింగరేణి యాజమాన్యం మంగళం పాడేందుకు యోచించడంపై కార్మిక కుటుంబాలు ఆందోళన పడుతున్నాయి. ఇదే జరిగితే సింగరేణిలో వేలాది కుటుంబాలు వీధిన పడుతాయి. ఈ పరిస్థితి సింగరేణిలో అల్ల కల్లోలానికి దారి తీస్తోంది.

మౌనంగా కార్మిక సంఘాలు..

సింగరేణిలో మహిళ ఉద్యోగులను ఏదో వంకతో ఉద్వాసన పలికేందుకు యజమాన్యం పన్నుతున్న కుట్రలకు కార్మిక సంఘాల నుంచి మౌనం ఎదురు కావడంపై విమర్శలు పెల్లుబికుతున్నాయి. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల అనంతరం మహిళా ఉద్యోగుల ఏరివేతకు యజమాన్యం కుట్రలు పన్నుతుంటే కార్మిక సంఘాలు తమకేం తెలియనట్టు వ్యవహరిoచడపై విమర్శలు పె ల్లుబికుతున్నాయి. ప్రధానంగా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ఐఎన్టీయుసీకి తెలియకుండా సింగరేణి యాజమాన్యం ఏ పని చేయదనేది జగమెరిగిన సత్యం. కాగా మహిళా ఉద్యోగులను అండర్ గ్రౌండ్ లో దింపి తద్వారా వారిని గైర్హాజరు పేరిట ఉద్యోగాల నుంచి తొలగిలింపుకు యాజమాన్యం తెరతీసింది. అందుకే మహిళా ఉద్యోగులను అండర్ గ్రౌండ్ వీధుల్లోకి పంపించడం కోసం తాతహలాడుతోంది. సింగరేణిలో మహిళ ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ కార్మిక సంఘాల నుంచి కనీస ప్రతిస్పందన లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మానవత్వం మర్చిపోయి సింగరేణి యాజమాన్యం మహిళా ఉద్యోగులను ఇంటికి పంపించాలని ప్రయత్నాలు పారిశ్రామిక అశాంతికి దారి తీయనున్నాయి. భూగర్భంలో పనిచేయడానికి పురుష కార్మికులే అనునిత్యం అష్ట కష్టాలు పడుతుంటారు. ఈ క్రమంలో మహిళా ఉద్యోగులు భూగర్భ గనుల్లో ఎలా పనిచే స్తారనేది యాజమాన్యానికి తెలియాలి.

సింగరేణిలో భూగర్భ గనుల్లో 190 మాస్టర్ నింపలేని చాలా మంది కార్మికులు గతంలో ఉద్యోగాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కనీస సౌకర్యాలు లేక రెగ్యులర్గా పనిచేయలేక నిర్దేశిత మస్టర్లు పూరించలేక ఉద్యోగాలు వదులుకున్నారు. అలాంటిది మహిళా ఉద్యోగిణిలు భూగర్భ గనుల్లో పని చేయడం వారికి ఎంత కష్టమో తెలియని కాదు. సింగరేణిలో మహిళా ఉద్యోగులు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి పనిచేయడం అంటే ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడినట్లే నన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నీ తెలిసి కూడా మహిళా కార్మికులను అండర్ గ్రౌండ్ లో దింపే తపన వెనుక వారి తొలగింపే యజమాన్యం మనోగతం గా కనిపిస్తోంది. ఇక భవిష్యత్తులో సింగరేణిలో మహిళా ఉద్యోగులు ప్రవేశానికే గండి పడుద్ది. ఇందుకోసమే సింగరేణి యాజమాన్యం మహిళా కార్మికులపై పని ఒత్తిడిని రెట్టింపు చేసింది. ఇప్పటి నుంచే మహిళా కార్మికుల సంఖ్యను నిర్వీర్యం చేసేందుకు ప్రణాళికతో అడుగులు వేస్తోంది.

మహిళలపై పెరిగిన పని భారం..

సింగరేణిలో మహిళ ఉద్యోగులపై పని భారం రెట్టింపు అయింది. ఉపరితలం విభాగాల్లో వివిధ కార్యాలయాల్లోనూను పని చేస్తున్న మహిళల పై నానా రకాల వేధింపులు జరుగుతున్నాయి. సిఎస్పిల్లో పనిచేస్తున్న మహిళా కార్మికులకు అధిక శ్రమను చేపిస్తూ కక్ష సాధింపులకు దిగుతున్నారు. కన్వేయర్ బెల్ట్ ల వద్ద చెమ్మా సులతో బొగ్గు పేల్లలను బెల్ట్ పై వేయిస్తున్నారు. ఈ పని అండర్ గ్రౌండ్ లో పనికి ఏమాత్రం తీసిపోని దిగా ఉన్నది. అయినప్పటికీ మహిళా కార్మికులు బొగ్గు ఉత్పత్తిలో భాగస్వాములు అవుతున్నారు. బ్రిటిష్ కాలంలో సింగరేణిలో మహిళలు పురుషులతో పాటు బొగ్గు ఉత్పత్తి చేస్తుండే వారని విన్నాము. అలాంటి బ్రిటిష్ కాలం నాటి పని విధానపు రోజులు సింగరేణిలో నల్ల దొరలు పునరావృతానికి ద్వారాలు తెరిచేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఒకవైపు అండర్ గ్రౌండ్ లోకి మహిళ కార్మికులను పంపించేందుకి తెర వెనుక ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు మహిళా కార్మికులను ఉపరితలంలో నానా రకాల పనులు చేపిస్తున్నారు. బొగ్గు బొగ్గు రవాణా అనుసంధాన రంగాల్లో మహిళ కార్మికులను నియమిస్తున్నారు. అతి కష్టతరమైన పనులు మహిళా కార్మికుల తోటి చేపిస్తున్నారు. దానికి తోడు మహిళా కార్మికులను అగౌరవ పరుస్తున్నారు. మహిళా కార్మికులు పనిచేసే అనువైన పరిస్థితులు సింగరేణిలో క్రమేణా దూరమవుతున్నాయి. తోటి కార్మికులుగా మహిళలకు గుర్తింపు గగనమైంది. మహిళా కార్మిక హక్కులకు భంగం కలిగే పరిస్థితులు బలోపేతం అవుతున్నాయి. మహిళా కార్మికుల ఉద్యోగ, జీవించే జన్మహక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక సంఘాలపై ఎంతైనా ఉంది. సింగరేణిలో మహిళా ఉద్యోగుల మెడకు వేలాడే కత్తిలా కార్పొరేట్ కంపెనీ విధానాలు రెక్కలు విప్పుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త అని సింగరేణి లోకాన్ని హెచ్చరిస్తున్నారు బుద్ధి జీవులు.


Similar News