కోర్టుల్లో 5.1 కోట్ల కేసులు పెండింగ్ : మాజీ ఎంపీ వినోద్ కుమార్

భారతదేశంలో 5.1 కోట్ల కేసులు పెండింగ్ లో ఉండగా వాటిలో 20 లక్షల కేసులు 30 యేండ్లుగా పెండింగ్ లో ఉన్నాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.

Update: 2024-08-07 17:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : భారతదేశంలో 5.1 కోట్ల కేసులు పెండింగ్ లో ఉండగా వాటిలో 20 లక్షల కేసులు 30 యేండ్లుగా పెండింగ్ లో ఉన్నాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టుకు 34 మంది జడ్జీలే ఉన్నారని, 64 మంది ఉంటే తప్పేమిటి? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 24 మంది జడ్జిలే ఉండేవారని, కేసీఆర్ చొరవతో 2018లో 42 మంది జడ్జిలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఇందులో అప్పటి సీజే ఎన్వి రమణ చొరవ కూడా ఉందన్నారు. ఏపీ హైకోర్టులో 37 మంది జడ్జిలే ఉన్నారని పేర్కొన్నారు. ఇపుడు పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయని, సుప్రీం బెంచ్ లు నాలుగు చోట్ల ఏర్పాటు చేయడంతో పాటు సుప్రీం కోర్టు జడ్జిల సంఖ్యను 64 కు పెంచాలన్నారు. ఫుల్ కోర్టు న్యాయవాదులు సుప్రీం బెంచీల ఏర్పాటును రకరకాల కారణాలతో వ్యతిరేకిస్తున్నారని, ఫుల్ కోర్టు తన వైఖరి మార్చుకుని సుప్రీం బెంచీల ఏర్పాటు చేసేందుకు, జడ్జీల సంఖ్య పెంచేందుకు చొరవ చూపాలని కోరారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నిన్న చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. సుప్రీం కోర్టు బెంచీలు దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఉండాలని ఎప్పట్నుంచో డిమాండ్ ఉందని గుర్తు చేసారు. నాలుగు చోట్ల సుప్రీం బెంచ్ లు ఏర్పాటు చేయడం దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతుందని కొందరు అనవసర వాదన లేవనెత్తుతున్నారని చెప్పారు. తాను 2015 లోనే ఎంపీగా సుప్రీం బెంచీల ఏర్పాటు ఆవశ్యకత ఉందని పార్లమెంటు లో నేను రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదించానని తెలిపారు.

కేసుల పరిష్కారంలో 90 స్థానం : సోమ భరత్

న్యాయవ్యవస్థలో కేసుల పరిష్కారం వారీగా చూస్తే 142 దేశాల్లో 93 వ స్థానంలో ఉందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ తెలిపారు. సుప్రీంకోర్టు బెంచీల ఏర్పాటు విషయం లో ఫుల్ కోర్టు వాదన సమంజసంగా లేదన్నారు. కేసులు పెండింగ్ లో ఉంటే అది దేశ జీడీపీపై ప్రభావం చూపుతుందన్నారు. ఆయన న్యాయ వ్వవస్థకు కేంద్ర బడ్జెట్ లో 0.1 శాతం నిధులే కేటాయించారని, ఇది ఏ మూలకు సరిపోదని ఆందోళన వ్యక్తం చేసారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసి అంతటా కోర్టులు ఏర్పాటు చేసి, కోర్టులను కంప్యూటీరకరించిందని, ఇది చాలా రాష్ట్రాల్లో లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సుప్రీం కొత్త బెంచీలు ఏర్పాటు చేయాలని, జడ్జీల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేసారు. 


Similar News