మాట తప్పే వ్యక్తిని కాదు : సునీల్ ఛెత్రి
భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
దిశ, స్పోర్ట్స్ : భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో భాగంగా గురువారం కువైట్తో మ్యాచ్ అతనికి చివరిది కానుంది. ఆఖరి మ్యాచ్లో విజయంతో కెరీర్కు ముగింపు పలకాలని అతను భావిస్తున్నాడు. బుధవారం సునీల్ ఛెత్రి మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకుంటారా? అని ప్రశ్నించగా.. లేదని సమాధానమిచ్చాడు.
‘నేను మాటలను వెనక్కి తీసుకునే వ్యక్తిని కాదు. ఇక ఓ అభిమానిగా భారత్ మ్యాచ్లకు వెళ్తాను.’ అని చెప్పాడు. అలాగే, కువైట్తో మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. ‘మూడో రౌండ్కు చేరుకోవడానికి మాకు అద్భుతమైన అవకాశం. కువైట్పై గెలిస్తే దాదాపుగా అర్హత సాధించినట్టే. ఈ మ్యాచ్ నా గురించో, నా చివరి మ్యాచ్ గురించో కాదు. మా దృష్టి అంతా గెలవడంపైనే ఉంది. చివరి మ్యాచ్లో గోల్ చేయాలని ఉంది. అంతకంటే ఫలితం ముఖ్యం. మేము గెలుస్తున్నాం. మూడో రౌండ్కు చేరుకుంటున్నాం.’ అని సునీల్ ఛెత్రి ధీమా వ్యక్తం చేశాడు. రిటైర్మెంట్ తర్వాత తాను ఫుడ్ తినడం ఆస్వాదిస్తానని చెప్పాడు. అన్నీ తింటానని, ముఖ్యంగా ఆలూ పరాటా తినాలని ఉందని తన కోరక బయటపెట్టాడు.