సైనా నెహ్వాల్‌పై ట్వీట్ చేసి విమర్శల పాలైన కేకేఆర్ బ్యాటర్.. చివరికి క్షమాపణలు

కోల్‌కతా నైట్ రైడర్స్ యువ క్రికెటర్ రఘువంశీ భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా సెహ్వాల్‌కు క్షమాపణలు చెప్పాడు.

Update: 2024-07-12 16:43 GMT

దిశ, స్పోర్ట్స్ : కోల్‌కతా నైట్ రైడర్స్ యువ క్రికెటర్ రఘువంశీ భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా సెహ్వాల్‌కు క్షమాపణలు చెప్పాడు. అసలేం జరిగిందంటే.. ఇటీవల ఓ ఇంటర్యూలో పాల్గొన్న సైనా నెహ్వాల్ క్రికెట్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇతర క్రీడలతో పోలిస్తే క్రికెట్‌కే ఆదరణ ఎక్కువని, అప్పుడప్పుడు ఇది తనను బాధపెడుతుందని వ్యాఖ్యానించింది. ‘బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, టెన్నిస్‌, ఇతర క్రీడలు శారీరకంగా కష్టమైనవి. షటిల్‌ తీసుకొని సర్వ్‌ చేసేంత టైం కూడా దొరకదు. ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. క్రికెట్‌లో నైపుణ్యాలు ముఖ్యమని నేను నమ్ముతా. కొన్నిసార్లు క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం బాధగా ఉంటుంది.’అని చెప్పుకొచ్చింది.

సైనా నెహ్వాల్ కామెంట్స్‌పై రఘువంశీ స్పందించి విమర్శలపాలయ్యాడు. ‘బుమ్రా 150 కి.మీ వేగంతో ఆమె తలపైకి బౌలింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం’ అని అతను చేసిన ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.దీంతో ఆ ట్వీట్‌ను డిలీట్ చేసిన రఘువంశీ.. సైనా నెహ్వాల్‌కు క్షమాపణలు చెబుతూ మరో పోస్టు పెట్టాడు. ‘ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నా. జోక్‌గా చెప్పాను. కానీ, ఆలోచిస్తే అది పరిణితి లేని జోక్‌గా అనిపించింది. నా తప్పును తెలుసుకున్నా.. క్షమించండి.’ అని ట్వీట్ చేశాడు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్‌లో కేకేఆర్ తరపున రఘువంశీ అరంగేట్రం చేశాడు. తొలి సీజన్‌లోనే ఆకట్టుకున్నాడు. 7 ఇన్నింగ్స్‌ల్లో 155.24 స్ట్రైక్‌రేటుతో 163 పరుగులు చేశాడు. 


Similar News