సాత్విక్ జోడీ అదరహో.. థాయిలాండ్ ఓపెన్ టైటిల్ కైవసం

భారత పురుషుల డబుల్స్ స్టార్ ప్లేయర్లు సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి మళ్లీ అదరగొట్టారు.

Update: 2024-05-19 12:35 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత పురుషుల డబుల్స్ స్టార్ ప్లేయర్లు సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి మళ్లీ అదరగొట్టారు. ఈ జంట థాయిలాండ్ ఓపెన్ పురుషుల డబుల్స్ చాంపియన్‌గా నిలిచింది. బ్యాంకాక్‌లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్ జోడీ 21-15, 21-15 తేడాతో చైనాకు చెందిన చెన్ బో యాంగ్-లియు యి జంటను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత షట్లర్లు స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించారు. అయితే, తొలి గేమ్‌లో ప్రత్యర్థులు కాస్త ఇబ్బంది పెట్టారు. ఒక దశలో 10-7తో సాత్విక్, చిరాగ్‌లు వెనుకబడ్డారు. ఈ సమయంలో తిరిగి పుంజుకుని గేమ్‌ను చేతుల్లోకి తీసుకున్నారు. ఇక, రెండో గేమ్‌లో పూర్తిగా భారత షట్లర్లదే హవా. దీంతో 46 నిమిషాల్లోనే మ్యాచ్‌ను నెగ్గి టైటిల్ సొంతం చేసుకున్నారు.

తొలి రౌండ్ నుంచి ఏకపక్షంగా గెలుచుకుంటూ వచ్చిన సాత్విక్ జోడీ ఈ టోర్నీలో ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. థాయిలాండ్ ఓపెన్ విజేతగా నిలవడం ఈ జంటకు ఇది రెండోసారి. 2019లో తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. అంతేకాకుండా, ఈ జంట ఖాతాలో ఇది 4వ సూపర్-500 టైటిల్. ఇప్పటివరకు సూపర్-500 టోర్నీ ఫైనల్‌ను ఈ జోడీ కోల్పోలేదు. అలాగే, ఈ సీజన్‌లో మార్చిలో ఫ్రాన్స్ ఓపెన్ నెగ్గిన తర్వాత ఇది రెండోది. మొత్తంగా సాత్విక్ ద్వయానికి 9వ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ కావడం గమనార్హం. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు సాత్విక్, చిరాగ్ జంటకు ఈ విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. అలాగే, పురుషుల డబుల్స్‌లో తిరిగి వరల్డ్ నం.1 ర్యాంక్‌ను దక్కించుకోనుంది. 

Tags:    

Similar News