Champions Trophy : భారత్, పాక్ మ్యాచ్కు అంపైర్లు వీరే
చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మ్యాచ్లకు దుబాయ్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మ్యాచ్లకు దుబాయ్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే సిరీస్ భారత్ కైవసం చేసుకోగా.. బుధవారం ఆఖరి వన్డే జరగనుంది. ఈ నెల 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంకానుంది. అందుకు నాలుగు రోజుల ముందు అంటే ఈ నెల 15న రోహిత్ సేన దుబాయ్కి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఐసీసీ టోర్నీకి ముందు టీమిండియా ఎలాంటి వార్మప్ మ్యాచ్ ఆడటం లేదు. సాధారణంగా ఐసీసీ ఈవెంట్కు ముందు ఒక్కటైనా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతారు. కానీ, బిజీ షెడ్యూల్ కారణంగా భారత జట్టు వార్మప్ మ్యాచ్ లేకుండానే టోర్నీలో బరిలోకి దిగనుంది. టోర్నీలో ఈ నెల 20న భారత్ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది.
భారత్, పాక్ పోరుకు అంపైర్లు వీరే
క్రికెట్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్, పాక్ మ్యాచ్ ఈ నెల 23న జరగనుంది. ఈ దాయాదుల పోరుకు మ్యాచ్ అఫీషియల్స్ను ఐసీసీ సోమవారం ఖరారు చేసింది. పాల్ రీఫిల్(ఆస్ట్రేలియా), రిచర్డ్ ఇల్లింగ్వర్త్(ఆస్ట్రేలియా) ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. టీవీ అంపైర్గా మైఖేల్ గోఫ్, ఫోర్త్ అంపైర్గా అడ్రియన్ హోల్డ్స్టాక్, మ్యాచ్ రిఫరీగా డేవిడ్ బూన్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.