ఆమె ఏమైనా డ్రగ్స్ తీసుకుందా?. వేటు వేయడంలో అర్థమే లేదు : వినేశ్‌కు మద్దతుగా పోస్టు పెట్టిన క్రికెట్ దిగ్గజం సచిన్

పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అదనపు బరువు కారణంగా అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే.

Update: 2024-08-09 14:36 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అదనపు బరువు కారణంగా అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్ నిర్వాహకుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రజత పతకం ఇవ్వాలని వినేశ్.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌(కాస్)ను ఆశ్రయించింది. తాజాగా వినేశ్ ఫొగట్‌కు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మద్దతుగా నిలిచాడు. వినేశ్‌కు రజతం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు.

శుక్రవారం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. అంపైర్ తీర్పుకు ఆసన్నమైందన్నాడు. ‘ప్రతి క్రీడలోనూ రూల్స్ ఉంటాయి. కానీ, వాటిని సందర్భోచితంగా చూడాలి. ప్రతిభను మెరుగుపర్చుకోవడానికి డ్రగ్స్ వంటి అనైతిక చర్యలకు పాల్పడిన అథ్లెట్లపై అనర్హత వేటు వేశారంటే అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాళ్లకు పతకం ఇవ్వకపోవడం సమర్థనీయమే. కానీ, వినేశ్ ఫొగట్ న్యాయమైన ఆట ఆడి ఫైనల్స్‌కు చేరుకుంది. బరువు కారణంగా ఆమె డిస్‌క్వాలిఫైడ్ అయ్యింది. కాబట్టి, ఆమెకు కచ్చితంగా రజత పతానికి అర్హురాలే. ఆమె నుంచి సిల్వర్ మెడల్‌ను దోచుకోవడం క్రీడా స్ఫూర్తిని ధిక్కరించడమే అవుతుంది. వినేశ్‌కు తగిన గుర్తింపు వస్తుందని ఆశిద్దాం, ప్రార్థిద్దాం.’ అని తెలిపాడు.

కాగా, 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు అర్హత సాధించిన వినేశ్.. ఫైనల్ రోజు ఉదయం బరువు కొలిచే సమయంలో నిర్దిష్ట బరువు కంటే 100 గ్రాములు అదనంగా ఉండటంతో నిర్వాహకులు ఆమెను అనర్హురాలుగా ప్రకటించారు. దీంతో ఆమె పతకం కోల్పోయింది. 

Tags:    

Similar News