స్మృతి మంధాన, ఎల్లీస్ పెర్రీ మెరుపులు.. యూపీ ముందు భారీ టార్గెట్

యూపీ వారియర్స్ ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 199 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది.

Update: 2024-03-04 15:39 GMT

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్‌-2లో బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో యూపీ వారియర్స్ ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 199 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. టాస్ గెలిచిన యూపీ బౌలింగ్ ఎంచుకోగా ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయి 198 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన(80) జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించింది. యూపీ బౌలింగ్‌లో ఎడాపెడా బౌండరీలు బాదింది. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన(28)తో కలిసి తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించింది. ఆ తర్వాత స్మృతి మంధానకు ఎల్లీస్ పెర్రీ తోడైంది. వీరిద్దరు మెరుపులు మెరిపించి పరుగుల వరద పారించారు. ఈ క్రమంలో స్మృతి మంధాన 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. ఆ తర్వాత కూడా ధాటిగా ఆడిన ఆమె సెంచరీకి చేరువగా వెళ్లింది. అయితే, దీప్తి శర్మ బౌలింగ్‌లో స్మృతి మంధాన క్యాచ్ అవుటవడంతో ఆమె దూకుడు బ్రేక్ పడింది. అనంతరం రిచా ఘోష్‌తో కలిసి అదే జోరును కొనసాగించిన పెర్రీ 32 బంతుల్లో అర్ధ శతకం నమోదు చేసింది. అయితే, చివరి ఓవర్‌లో తొలి బంతికి పూనమ్ ఖెమ్నార్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు పెర్రీ(58) పెవిలియన్ చేరింది. రిచా ఘోష్(21 నాటౌట్), సోఫి డివైన్(2 నాటౌట్) అజేయంగా నిలిచారు. యూపీ బౌలర్లలో తెలుగమ్మాయి అంజలి, దీప్తి శర్మ, ఎక్లోస్టోన్‌లకు చెరో వికెట్ దక్కింది.

ఈ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ జట్లు తలపడటం ఇది రెండోసారి. గత మ్యాచ్‌లో యూపీపై బెంగళూరు విజయం సాధించింది. ప్రస్తుతం యూపీ వరుసగా రెండు విజయాలతో జోరు మీద ఉన్నది. మరోవైపు, బెంగళూరు వరుసగా రెండు పరాజయాలతో వెనుకబడింది. ఈ మ్యాచ్‌లో నెగ్గి ఆర్సీబీ పుంజుకోవాలని చూస్తుండగా.. తొలి మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని యూపీ భావిస్తున్నది. 

Tags:    

Similar News