Asia Games 2023 : 'ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు'.. కొత్త కుర్రాడికి పాక్ కెప్టెన్సీ బాధ్యతలు
చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడల కోసం పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్డెస్క్: చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడల కోసం పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడని ఆల్రౌండర్ ఖాసిం అక్రమ్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన క్రికెట్బోర్డ్లు.. ఆసియా క్రీడలకు ఆడనున్న తమ జట్లను ప్రకటించగా.. పాకిస్థాన్ బోర్డు కూడా తాజాగా 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. తమ జట్టుకు అన్క్యాప్డ్ ఆల్రౌండర్ ఖాసిం అక్రమ్ను కెప్టెన్గా ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
ఖాసిం అక్రమ్తో పాటు మీర్జా తాహిర్ బేగ్, అరాఫత్ మిన్హాస్, రోహైల్ నజీర్, సుఫియాన్ ముఖీమ్, ముహమ్మద్ అఖ్లాక్ల ఓమైర్ బిన్ యూసుఫ్, తొలిసారి పాకిస్థాన్ జట్టులో చోటు దక్కింది. అదే విధంగా ఈ జట్టులో ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, షానవాజ్ దహానీ,మహ్మద్ హస్నైన్, ఉస్మాన్ ఖాదిర్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉండగా.. అయితే అందరి దృష్టి మాత్రం ఈ యంగ్ప్లేయర్ ఖాసిం అక్రమ్పై పడింది.
ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు ఆడిన ఖాసిం అక్రమ్.. 20 మ్యాచుల్లో 27 వికెట్లతో పాటు 960 పరుగులు చేశాడు. మరోవైపు లిస్ట్-ఏ క్రికెట్లో 45 మ్యాచ్లు ఆడగా.. 35.27 సగటుతో 1305 పరుగులు సాధించాడు. అండర్-19 ప్రపంచకప్-2021-2022లో పాక్ జట్టు కెప్టెన్గా కూడా కీలక బాధ్యతలు చేపట్టిన అక్రమ్.. కెప్టెన్గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. అంతే కాకుండా ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 విజేతగా పాక్ నిలవడంలోనూ అక్రమ్ కీలక పాత్ర పోషించాడు.
పాకిస్థాన్ తుది జట్టు:
ఖాసిమ్ అక్రమ్ (కెప్టెన్), అమీర్ జమాల్, అరాఫత్ మిన్హాస్, అర్షద్ ఇక్బాల్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ అఖ్లాక్ (వికెట్ కీపర్), మీర్జా తాహిర్ బేగ్, రోహైల్ నజీర్, ఒమైర్ బిన్ యూసుఫ్ (వైస్ కెప్టెన్), షానవాజ్ దహానీ, సుఫియాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖదీర్.