బాబర్‌ ఆజమ్‌పై పీసీబీ వేటు.. బోర్డు తీరుపై క్రికెటర్ల ఆగ్రహం!

Update: 2024-10-13 19:58 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోర్‌ సాధించినా.. ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో పాక్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాకిస్థాన్ రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. మంగళవారం ముల్తాన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్‌ను జట్టు నుంచి తప్పించాలని పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. తొలి టెస్టు ఓటమి తర్వాత టెస్టు కెప్టెన్ షాన్ మసూద్, కోచ్‌ గిలెస్పీ బాబర్ అజామ్‌కు మద్దతు ఇచ్చారు.

కానీ, సెలక్షన్ కమిటీలోని మిగతా సభ్యులు అజామ్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. అలీందార్‌, ఆఖిబ్‌ జావెద్‌, అజర్‌ అలీలు బాబర్‌ను తప్పించాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది. 2022 డిసెంబర్ తర్వాత బాబార్ అజామ్ టెస్టుల్లో కనీసం హాఫ్ సెంచరీ సాధించలేదు. ముల్తాన్ వేదికగా జరిగిన ఫ్లాట్ పిచ్‌పై కూడా 2 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 35 పరుగులే చేశాడు. రెండేళ్ల నుంచి 10 టెస్టులు ఆడిన బాబర్ 27.73 సగటుతో కేవలం 527 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా 55 టెస్టుల్లో 43.92 సగటుతో 3,997 పరుగులు మాత్రమే చేశాడు.

భారత్‌ను చూసి నేర్చుకోండి..

ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు బాబర్ ఆజమ్‌ను తప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో పాక్ క్రికెటర్ ఫఖార్ జమాన్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డాడు. ‘బాబర్‌ను తప్పించమేంటి? 2020-23 మధ్యకాలంలో విరాట్ సగటు ఎంత తక్కువగా ఉన్నా భారత్ అతడిని తప్పించలేదు. మన దేశంలోని అత్యుత్తమ బ్యాటరైన బాబార్‌ను తప్పించడం జట్టుకు తప్పుడు సంకేతాల నిస్తుంది’ అని ఆందోళన వ్యక్తంచేశారు.  

Tags:    

Similar News