IND VS SL : రేపు భారత్‌తో తొలి వన్డే.. శ్రీలంక జట్టుకు భారీ షాక్

టీమ్ ఇండియా చేతిలో టీ20 సిరీస్ కోల్పోయిన ఆతిథ్య శ్రీలంక జట్టుకు వన్డే సిరీస్‌కు ముందు భారీ షాక్ తగిలింది.

Update: 2024-08-01 12:18 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా చేతిలో టీ20 సిరీస్ కోల్పోయిన ఆతిథ్య శ్రీలంక జట్టుకు వన్డే సిరీస్‌కు ముందు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మతీశా పతిరణ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతనితోపాటు మరో బౌలర్ దిల్షాన్ మధుశంక కూడా అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్‌ఎల్‌సీ) గురువారం వెల్లడించింది. భారత్‌తో ఆఖరి టీ20లో క్యాచ్ పట్టేందుకు డైవ్ చేసేటప్పుడు పతిరణ కుడి భుజం బెణికింది. అలాగే, ప్రాక్టీస్‌లో మధుశంక తొడ భాగంలో గాయమైంది. ఈ నేపథ్యంలో వారు వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్టు ఎస్‌ఎల్‌సీ తెలిపింది.

కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న పతిరణ దూరమవడం వన్డే సిరీస్‌లో శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ఇప్పటికే శ్రీలంక జట్టు నువాన్ తుషారా, దుష్మంత చమీరా సేవలను కోల్పోయింది. తాజాగా పతిరణ, దిల్షాన్ మధుశంక కూడా దూరమవడంతో ఆ జట్టు బౌలింగ్ దళం బలహీనపడింది. వారి స్థానాల్లో అన్‌క్యాప్ట్ ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షిరాజ్, ఎసాన్ మలింగలను జట్టులోకి తీసుకున్నారు. మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి వన్డే జరగనుంది. 

Tags:    

Similar News