Paris Olympics : మను బాకర్‌కు అరుదైన గౌరవం

పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షూటర్ మను బాకర్ రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే.

Update: 2024-08-04 12:28 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షూటర్ మను బాకర్ రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. దేశానికి రెండు పతకాలు అందించిన ఆమెకు అరుదైన గౌరవం లభించింది. పారిస్ ఒలింపిక్స్‌ ముగింపు వేడుకల్లో భారత బృందాన్ని నడిపించే అవకాశం దక్కింది. మను బాకర్‌ను భారత పతకధారిగా ఎంపిక చేసినట్టు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 11న ఒలింపిక్స్ క్లోజింగ్ సెర్మనీ జరగనుంది. అయితే, పురుష పతకధారి ఎవరనేది ఇంకా ఖరారు చేయలేదు. ప్రారంభ వేడుకల్లో పీవీ సింధు, శరత్ కమల్ ఫ్లాగ్ బేరర్స్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

కాగా, ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు మూడు పతకాలు సాధించగా.. అందులో రెండు మను గెలిచినవే కావడం విశేషం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం నెగ్గి దేశానికి తొలి పతకం అందించింది. అలాగే, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి మరో బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకుంది. దీంతో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఆమె తృటిలో బ్రాంజ్ మెడల్‌ను చేజార్చుకుంది.

Tags:    

Similar News