Paris Olympics : వినేశ్‌కు రజతం ఎందుకు ఇవ్వరు?.. నిబంధనలు ఎలా ఉన్నాయి?

పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌ పతక ఆశలు ఆవిరయ్యాయి.

Update: 2024-08-07 13:28 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌ పతక ఆశలు ఆవిరయ్యాయి. 50 కేజీల కేటగిరీలో సంచలన ప్రదర్శన చేసిన ఆమె ఫైనల్‌కు చేరుకుని స్వర్ణ పతకం తెచ్చేలా కనిపించింది. అయితే, నిర్దిష్ట బరువు కంటే ఎక్కువ ఉందన్న కారణంతో ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో ఆమెను గోల్డ్ మెడల్ మ్యాచ్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే.

సాధారణంగా ఫైనల్‌కు చేరితే ఓడినా రజత పతకం దక్కుతుంది. అయితే, వినేశ్ ఫొగట్‌కు ఆ అవకాశం కూడా లేదు. అనర్హత వేటు పడిన అథ్లెట్‌కు పతకం ఇవ్వరు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిబంధనల ప్రకారం.. పోటీకి అథ్లెట్ హాజరు కాకపోయినా, నిర్దిష్ట బరువు లేకపోయినా సదరు అథ్లెట్‌ను ఎలిమినేట్ చేస్తారు. చివరి ర్యాంక్‌ను ఇస్తారు. దీంతో స్వర్ణ పతక ఆశలు రేపిన వినేశ్ కనీసం రజతం కూడా లేకుండానే స్వదేశానికి రానుంది.

అయితే, నిర్దిష్ట బరువు లేకపోయినా వినేశ్ కనీసం రజతం గెలుచుకునే అవకాశం ఉండేదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. భారత అధికారుల అవగాహన లోపం వల్లే భారత్‌కు పతకం చేజారిందని అంటున్నారు. వినేశ్ నిర్దిష్ట బరువు కంటే ఎక్కువ ఉందని ముందే తెలిసినప్పుడు ఆమెను అనారోగ్య కారణాలు చూపి పోటీ నుంచి తప్పిస్తే.. అప్పుడు సిల్వర్ మెడల్ దక్కేదని అంటున్నారు. 

Tags:    

Similar News