పాక్ మహిళా క్రికెటర్లకు నాలుగు నెలలుగా జీతాల్లేవ్!

పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతున్నది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఇంటర్నేషనల్ మీడియా కోడైకూస్తోంది.

Update: 2024-10-03 16:30 GMT

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతున్నది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఇంటర్నేషనల్ మీడియా కోడైకూస్తోంది. మహిళల టీ20 ప్రపంచకప్‌ సమయంలో ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలలుగా మహిళా క్రికెటర్లకు పీసీబీ జీతాలు ఇవ్వలేదని ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. ‘పాక్ మహిళా క్రికెటర్లు నాలుగు నెలలుగా జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. జూన్ నుంచి వారికి వేతనాలు ఇవ్వలేదు. ’అని సదరు మీడియా సంస్థ తెలిపింది. గతేడాది ఆగస్టు 1న 23 మంది పీసీబీ కాంట్రాక్ట్ పొందారు.

వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఒప్పందాలు కొనసాగించాల్సి ఉండగా 12 నెలలకే కాంట్రాక్ట్‌ను ముగించినట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న జీతాలను ఇవ్వలేదు. బోర్డులో చాలా జరుగుతుందని, సమయం లేకపోవడం వల్లే జీతాలు ఇవ్వడం ఆలస్యమైందని పీబీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పడం గమనార్హం. కొత్త కాంట్రాక్ట్ జాబితాను త్వరలోనే ఆమోదిస్తామని, జూలై నుంచి పరిగణలోకి తీసుకుంటామని పీసీబీ చెబుతోంది. గతనెలలో మహిళా క్రికెటర్ల రోజువారీ అలవెన్స్‌లను పీసీబీ రద్దు చేసింది. వరల్డ్ క్రికెట్‌లో పీసీబీ నాలుగో సంపన్న బోర్డుగా ఉన్నప్పటికీ.. ఐసీసీ సభ్యత్వ దేశాల్లో పాక్ మహిళా క్రికెటర్లు తక్కువ వేతనాలు పొందడం గమనార్హం. పాక్ పురుష క్రికెటర్లకు సంబంధించిన జీతాలు కూడా నాలుగు నెలలుగా పెండింగ్‌లోనే ఉన్నట్టు సదరు మీడియా స్థంస్థ తెలిపింది. 

Tags:    

Similar News