PAK vs ENG : ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ విజయం.. చిత్తుగా ఓడిన పాక్

ఇటీవల బంగ్లాదేశ్‌ చేతిలో సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ జట్టు సొంతగడ్డపై మరో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Update: 2024-10-11 12:17 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇటీవల బంగ్లాదేశ్‌ చేతిలో సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ జట్టు సొంతగడ్డపై మరో ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలి టెస్టులో పాక్ జట్టును ఇంగ్లాండ్ చిత్తుగా ఓడించింది. ముల్తాన్ వేదికగా శుక్రవారం ముగిసిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 556 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 823/7 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చి 267 పరుగుల ఆధిక్యం పొందింది.

భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన పాక్ పూర్తిగా తేలిపోయింది. కనీసం పోరాటం చేయకుండా 220 పరుగులకే కుప్పకూలింది. ఓవర్‌నైట్ స్కోరు 152/6తో చివరి రోజైన శుక్రవారం ఆట కొనసాగించిన పాక్ మరో 68 పరుగులే జోడించి ఆఖరి నాలుగు వికెట్లు కూడా కోల్పోయింది. అఘా సల్మాన్(63), అమీర్ జమాల్(55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

మూడు వికెట్లు జాక్ లీచ్ ఖాతాలో చేరగా.. అబ్రార్ అహ్మద్ గాయం కారణంగా బ్యాటింగ్ దిగకపోవడంతో పాక్ ఆట ముగిసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్(4/30) సత్తాచాటగా.. అట్కిన్సన్, బ్రైడన్ కార్సే చెరో వికెట్లతో సత్తాచాటారు. తొలి ఇన్నింగ్స్‌లో ట్రిపుల్ సెంచరీ బాదిన హ్యారీ బ్రూక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 

Tags:    

Similar News