4వ రౌండ్లో ప్రజ్ఞానంద ఓటమి
నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద రెండో ఓటమిని పొందాడు.
దిశ, స్పోర్ట్స్ : నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద రెండో ఓటమిని పొందాడు. మూడో రౌండ్లో వరల్డ్ నం.1 కార్ల్సన్పై సంచలన విజయం సాధించిన అతను తర్వాతి రౌండ్లో పరాజయం పాలయ్యాడు. శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్లో అమెరికా గ్రాండ్మాస్టర్ హికారు నకమురా చేతిలో గేమ్ను కోల్పోయాడు. నల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద అంత తేలిగ్గా గేమ్ను సమర్పించుకోలేదు. ప్రత్యర్థికి గట్టి సవాల్ విసిరిన అతను 86 ఎత్తుల్లో ఓటమిని అంగీకరించాడు. ఈ పరాజయంతో అగ్రస్థానాన్ని కోల్పోయి అతను 5.5 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచాడు. మరోవైపు, మహిళల విభాగంలో ప్రజ్ఞానంద సోదరి ఆర్.వైశాలి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 4వ రౌండ్లో ఆమె స్వీడన్ క్రీడాకారిణి పియా క్రామ్లింగ్పై విజయం సాధించింది. భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి కోనేరు హంపి ఖాతాలో మరో ఓటమి చేరింది. 4వ రౌండ్లో అన్నా ముజిచుక్(ఉక్రెయిన్) చేతిలో ఆమె పరాజయం పాలైంది. వైశాలి 8.5 పాయింట్లతో టాప్ పొజిషన్లో ఉండగా.. కోనేరు హంపి 3 పాయింట్లతో చివరి స్థానంలో ఉన్నది.