మళ్లీ బరిలో నీరజ్ చోప్రా.. ఆ లీగ్లో పాల్గొంటా : Neeraj Chopra
టోక్యో ఒలింపిక్స్ సర్ణ పతక విజేత నీరజ్ చోప్రా మళ్లీ బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్నాడు.
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ సర్ణ పతక విజేత నీరజ్ చోప్రా మళ్లీ బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్నాడు. కండరాల నొప్పి కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న ఈ జావెలిన్ త్రోయర్ డైమండ్ లీగ్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నాడు. కండరాల నొప్పి నుంచి కోలుకున్నానని, ఈ నెల 30వ తేదీన జరిగే డైమండ్ లీగ్లో పాల్గొంటానని చెప్పాడు. ఈ టోర్నీలో జెస్విన్ ఆల్డ్రిన్, శ్రీశంకర్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోకున్నారు. డైమండ్ లీగ్ నిర్వాహకులు కూడా జావెలిన్ త్రో ఈవెంట్లో పాల్గొనే ఆటగాళ్ల జాబితాలో 25 ఏళ్ల చోప్రా పేరును చేర్చారు. ఈ టోర్నీలో నీరజ్ చోప్రాకు జాకుబ్ వడ్లెజ్ (చెక్ రిపబ్లిక్), జూలియన్ వెబర్ (జర్మనీ) నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.
మే నెలలో ప్రాక్టీసు చేస్తుండగా కండరాలు పట్టేశాయని ట్విటర్లో చోప్రా చెప్పాడు. దీంతో నెదర్లాండ్స్లో జరిగిన ఎఫ్ బీకే గేమ్స్, ఫిన్లాండ్లో జరిగిన పావో నుర్మి మీట్కు డుమ్మా కొట్టాడు. భువనేశ్వర్లో జరిగిన అంతర్రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లోనూ పాల్గొన లేదు. జూన్ 27వ తేదీన చెక్ రిపబ్లిక్లో జరిగే గోల్డెన్ స్పైక్ ఆస్ట్రావా టోర్నమెంట్లోనూ చోప్రా పాల్గొనే అవకాశం ఉంది. మే నెలలో జరిగిన దోహా డైమండ్ లీగ్లో జావెలిన్ ను 88.67 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచిన చోప్రా ఈ సీజన్ను అద్భుతంగా ప్రారంభించాడు. బుడాపెస్ట్, హంగేరిలో జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్లు, ఆసియా క్రీడల్లోనూ చోప్రా పాల్గొనాల్సి ఉంది.