MS Dhoni: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో గోల్ఫ్‌ ఆడిన ధోనీ.. వీడియో వైరల్‌

అమెరికా వెకేషన్‌లో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసాడు.

Update: 2023-09-08 10:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా వెకేషన్‌లో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసాడు. ధోనీని విపరీతంగా అభిమానించే ట్రంప్.. అతను అమెరికా పర్యటనలో ఉన్న విషయాన్ని స్వయంగా తెలుసుకొని తన ఇంటికి ఆహ్వానించాడు. ట్రంప్ ఆహ్వానం మేరకు వెళ్లిన ధోనీ.. అమెరికా మాజీ అధ్యక్షుడితో కలిసి సరదాగా గోల్ఫ్ ఆడాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ధోనీని కలుసుకునేందుకే ట్రంప్.. ప్రత్యేకంగా గోల్ఫ్ గేమ్ ఏర్పాటు చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. తొలుత ధోనీ స్నేహితుడు, వ్యాపారవేత్త హితేశ్ సంఘ్వీ ట్రంప్‌తో ఉన్న ఫొటోలను ఇన్‌‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ తర్వాత ట్రంప్‌తో ధోనీ గోల్ఫ్ ఆడుతున్న ఓ వీడియో వైరల్ అయ్యింది.

ఇక ధోనీ క్రేజా మజాకా అంటూ అతని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలోనూ ధోనీ మానియా నడుస్తుందని, దేశాధ్యక్షులే ధోనీ కోసం క్యూ.. కడుతున్నారని కామెంట్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లోనూ ధోనీ సందడి చేసిన విషయం తెలిసిందే. వరల్డ్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌కు ధోనీ తన స్నేహితులతో కలిసి హాజరయ్యాడు. ఓ సాధారణ ప్రేక్షకుడిగా మ్యాచ్‌ను ఆస్వాదించాడు. ఆట మధ్యలో అల్కరాజ్ కాసేపు విశ్రాంతి తీసుకుని డ్రింక్స్‌ తాగుతుండగా అతని వెనుకవైపు ప్రేక్షకుల సీట్లలో కూర్చుని ఉన్న ధోనీ తన ఫ్రెండ్స్‌తో ముచ్చటిస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గురువారం జరిగిన పురుషుల క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 6-3, 6-2, 6-4 తేడాతో 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను మట్టి కరిపించాడు. ఈ విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను విజేతగా నిలిపాడు.


Similar News