Macau Open 2024 :సెమీస్‌కు గాయత్రి జోడీ.. క్వార్టర్స్‌లో శ్రీకాంత్ ఔట్

చైనాలో జరుగుతున్న మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ షట్లర్లు గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ జోరు కొనసాగుతోంది.

Update: 2024-09-27 13:49 GMT

దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ షట్లర్లు గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ జోరు కొనసాగుతోంది. మహిళల డబుల్స్ విభాగంలో వరుసగా మూడో విజయం నమోదు చేసిన ఈ జంట సెమీస్‌లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గాయత్రి ద్వయం 21-12, 21-17 తేడాతో చైనీస్ తైపీకి చెందిన హ్సు యిన్ హుయ్-లోన్ ఝిహ్ యున్ జోడీపై గెలుపొందింది. 6వ సీడ్‌పై భారత జంట స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దూకుడుగా ఆడి 39 నిమిషాల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. సెమీస్‌లో చైనీస్ తైపీకే చెందిన హ్సీ పీ షాన్-హంగ్ ఎన్ ట్జు జంటతో గాయత్రి ద్వయం తలపడనుంది. మరోవైపు మెన్స్ సింగిల్స్‌లో తెలుగు కుర్రాడు, స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ జోరుకు బ్రేక్ పడింది. క్వార్టర్ ఫైనల్‌లో ఇంటిదారిపట్టాడు. 2వ సీడ్, హాంకాంగ్ ఆటగాడు కా లాంగ్ అంగస్ చేతిలో 16-21, 12-21 తేడాతో శ్రీకాంత్ ఓడిపోయాడు. ఇక, ఈ టోర్నీలో భారత్ ఆశలన్నీ గాయత్రి-ట్రీసా జాలీ జోడీపైనే ఉన్నాయి. 

Tags:    

Similar News