తెలంగాణ కుర్రాడు లోకేశ్ రెడ్డి జోరు.. క్వార్టర్స్కు క్వాలిఫై
కయోహ్సియుంగ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ కుర్రాడు కలగొట్ల లోకేశ్ రెడ్డి అదరగొడుతున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : తైవాన్లో జరుగుతున్న కయోహ్సియుంగ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ కుర్రాడు కలగొట్ల లోకేశ్ రెడ్డి అదరగొడుతున్నాడు. మెన్స్ సింగిల్స్లో వరుసగా మూడు విజయాలు సాధించి క్వార్టర్స్కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్లో లోకేశ్ 23-21, 21-10 తేడాతో ఆస్ట్రేలియా ఆటగాడు జాక్ యూను చిత్తు చేశాడు. తొలి గేమ్లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా లోకేశ్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. పోరాట పటిమతో ఆ గేమ్ను నెగ్గాడు. ఇక, రెండు గేమ్లో లోకేశ్ దూకుడు ముందు ఆసిస్ ఆటగాడి వద్ద సమాధానమే లేదు. కేవలం 27 నిమిషాల్లోనే లోకేశ్ మ్యాచ్ను దక్కించుకున్నాడు. క్వార్టర్స్లో అతను తనకంటే మెరుగైన ర్యాంక్ కలిగిన చీమ్ జూన్ వీ(మలేషియా)ను ఎదుర్కోనున్నాడు.