ఇండోనేషియా ఓపెన్లో క్వార్టర్స్కు లక్ష్యసేన్
ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లాడు.
దిశ, స్పోర్ట్స్ : జకార్తాలో జరుగుతున్న ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్లో లక్ష్యసేన్ 21-9, 21-15 తేడాతో జపాన్ ఆటగాడు కెంటా నిషిమోటోను చిత్తు చేశాడు. దూకుడుగా ఆడిన లక్ష్యసేన్ కేవలం 45 నిమిషాల్లోనే విజయం అందుకున్నాడు. తొలి గేమ్ను ఏకపక్షంగా గెలుచుకున్న అతను.. రెండో గేమ్లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్నప్పటికీ ఆధిపత్యం ప్రదర్శించాడు. క్వార్టర్స్లో డెన్మార్క్ ఆటగాడు ఆంటోన్సెన్ను లక్ష్యసేన్ ఎదుర్కోనున్నాడు.
మరోవైపు, డబుల్స్లో రెండో రౌండ్లో భారత్కు నిరాశ ఫలితాలే వచ్చాయి. ఉమెన్స్ డబుల్స్లో స్టార్ జంట గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ ఇంటిదారిపట్టింది. 7వ సీడ్ మయు మత్సుమోటో-నగహర(జపాన్) జంట చేతిలో 19-21, 21-19, 21-19 తేడాతో పోరాడి ఓడింది. తొలి గేమ్ నెగ్గి శుభారంభం చేసినా.. మిగతా రెండు గేమ్ల్లో తీవ్రంగా పోరాడినా ఫలితం దక్కలేదు. మరో జంట అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో 13-21, 21-19, 13-21 తేడాతో 2వ సీడ్ బేక్ హ నా-లీ సో హీ(సౌత్ కొరియా) చేతిలో పరాజయం పాలైంది. మిక్స్డ్ డబుల్స్లో సుమిత్ రెడ్డి-సిక్కిరెడ్డి జంట కూడా రెండో రౌండ్లో నిష్ర్కమించింది.