Jasprit Bumrah: టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్.. ఐర్లాండ్ సిరీస్‌కు బుమ్రా!

Update: 2023-06-18 14:30 GMT

న్యూఢిల్లీ: టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా త్వరలోనే తిరిగి జట్టులోకి రానున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో బ్యాక్ పెయిన్‌ కారణంగా అతను జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న బుమ్రా ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో కోలుకుంటున్నాడు. ఫిట్‌నెస్‌ పరంగా అతను వేగంగా పురోగతి సాధిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ కంటే ముందే అతను తిరిగి జట్టులోకి పునరాగమనం చేయనున్నట్టు తెలుస్తోంది. ఆగస్టులో ఐర్లాండ్‌తో భారత్ మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌కు బుమ్రా అందుబాటులో ఉండే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపాడు.

‘ఆగస్టులో జరిగే ఐర్లాండ్ సిరీస్‌కు బుమ్రా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అతని రాకతో టీమ్ ఇండియా బలపడుతుంది. అన్ని అనుకూలంగా ఉంటే ఫిట్‌నెస్‌పరంగా వేగంగా పురోగతి సాధిస్తున్న అతను త్వరలోనే మైదానంలో అడుగుపెడతాడు’ అని చెప్పారు. అలాగే, గాయం కారణంగా ఆటకు దూరమైన శ్రేయస్ అయ్యర్ సైతం ఆసియా కప్ నాటికి జట్టులో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


Similar News