షూటింగ్ వరల్డ్ కప్లో భారత్కు మరో పతకం.. కాంస్యం గెలిచిన సిఫ్ట్ కౌర్
ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్ కప్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది.
దిశ, స్పోర్ట్స్ : జర్మనీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్ కప్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్ స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. శుక్రవారం మహిళా షూటర్ సిఫ్ట్ కౌర్ కాంస్యం దక్కించుకుంది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో ఆమె మూడో స్థానంలో నిలిచింది. 452.9 స్కోరుతో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. గ్రేట్ బ్రిటన్కు చెందిన సెనాయిడ్ మోకింతోష్(466.7) స్వర్ణం, చైనా షూటర్ హాన్ జియాయు(462.6) రజతం సాధించారు. ఇదే ఈవెంట్లో పురుషుల కేటగిరీ ఫైనల్లో భారత షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్(408.9) 8వ స్థానంతో సరిపెట్టాడు. దీంతో భారత్ రెండు పతకాల(స్వర్ణం, కాంస్యం)తో ఈ టోర్నీని ముగించింది.