తరుణ్ అదరహో.. అంతర్జాతీయ వేదికపై తెలుగు కుర్రాడు సత్తా

భారత మెన్స్ సింగిల్స్ నం.1 షట్లర్, తెలంగాణ కుర్రాడు మన్నెపల్లి తరుణ్ అంతర్జాతీయ వేదికగాపై సత్తాచాటాడు.

Update: 2024-04-06 16:04 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత మెన్స్ సింగిల్స్ నం.1 షట్లర్, తెలంగాణ కుర్రాడు మన్నెపల్లి తరుణ్ అంతర్జాతీయ వేదికగాపై సత్తాచాటాడు. కజకిస్తాన్‌ వేదికగా జరిగిన కజకిస్తాన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో మెన్స్ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. టోర్నీలో ఆరంభం నుంచి అదరగొడుతున్న తరుణ్ ఫైనల్‌లోనూ తన కంటే మెరుగైన ర్యాంక్‌ ప్లేయర్‌పై అదే జోరు కొనసాగించాడు. శనివారం జరిగిన ఫైనల్‌లో 8వ సీడ్, మలేషియా ప్లేయర్ సూంగ్ జూ వెన్‌‌ను 21-10, 21-19 తేడాతో తరుణ్ చిత్తు చేశాడు. స్పష్టమైన ఆధిపత్యంతో ఏకపక్షంగా తొలి గేమ్‌ నెగ్గిన తరుణ్.. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి పోటీ తట్టుకుని విజేతగా నిలిచాడు. తరుణ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టైటిల్.

మరోవైపు, ఉమెన్స్ సింగిల్స్ టైటిల్‌ను భారత యువ క్రీడాకారిణి అనుపమ ఉపాధ్యాయ సొంతం చేసుకుంది. ఫైనల్‌లో సహచర క్రీడాకారిణి ఇషారాణిపై 15-21, 16-21 తేడాతో అనుపమ విజయం సాధించింది. అలాగే, మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు సంజయ్ శ్రీవాస్తవ ధన్‌రాజ్-మనీష జోడీ రన్నరప్‌గా సరిపెట్టింది. ఫైనల్‌లో ధన్‌రాజ్-మనీష జోడీ 21-9, 7-21, 12-21 తేడాతో మలేషియాకు చెందిన వాంగ్ టియన్ సి-లిమ్ చీవ్ సియెన్‌ జోడీ చేతిలో పరాజయం పాలైంది. 

Tags:    

Similar News