బంతితో చెలరేగిన స్నేహ్ రాణా.. సౌతాఫ్రికా ఆలౌట్

సౌతాఫ్రికాతో ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు విజయం దిశగా వెళ్తున్నది.

Update: 2024-06-30 16:17 GMT

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికాతో ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు విజయం దిశగా వెళ్తున్నది. స్నేహ్ రాణా(8/77) బంతితో విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 337 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. హర్మన్‌ప్రీత్ సేన తొలి ఇన్నింగ్స్‌లో 603/6 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చిన విషయం తెలిసిందే. చెన్నయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది.

ముందుగా ఓవర్‌నైట్ స్కోరు 236/4తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆ జట్టు మరో 30 పరుగులు మాత్రమే జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది. అందులో ఐదు వికెట్లు స్నేహ్ రాణా ఖాతాలోనే చేరాయి. మొత్తంగా స్నేహ్ రాణా 8 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. దీంతో సౌతాఫ్రికా 266 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగుల ఆధిక్యం దక్కడంతో భారత జట్టు సౌతాఫ్రికాను ఫాలో ఆన్ ఆడించింది. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన దక్షిణాఫ్రికా పోరాడుతోంది. సునె లూస్(109) సెంచరీతో సత్తాచాటింది. ఆమెకుతోడు ఓపెనర్, కెప్టెన్ వోల్వార్డ్ట్(93 బ్యాటింగ్) కూడా రాణించడంతో ఫాలో ఆన్‌లో సౌతాఫ్రికా స్కోరు 200 దాటింది. వోల్వార్డ్ట్‌తోపాటు మారిజన్నె కాప్(15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆ జట్టు ఇంకా 105 పరుగులు వెనుకబడి ఉన్నది. నాలుగో రోజు బౌలర్లు చెలరేగితే భారత్‌కు మరో రోజు మిగిలి ఉండగానే విజయం దక్కనుంది. 


Similar News