శాంసన్ హాఫ్ సెంచరీ.. దూబె మెరుపులు.. జింబాబ్వే ముందు లక్ష్యం ఎంతంటే?
జింబాబ్వే పర్యటనలో యువ భారత్ ఇప్పటికే సిరీస్ను సొంతం చేసుకుంది.
దిశ, స్పోర్ట్స్ : జింబాబ్వే పర్యటనలో యువ భారత్ ఇప్పటికే టీ౨౦ సిరీస్ను సొంతం చేసుకుంది. ఇవాళ జరుగుతున్న ఐదో టీ20 కూడా నెగ్గి విజయంతో టూరును ముగించాలని భావిస్తున్నది. ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగిన భారత్ ఆతిథ్య జింబాబ్వే ముందు టఫ్ టార్గెట్ పెట్టింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. గత మ్యాచ్లో రెచ్చిపోయి ఆడిన ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(12), శుభ్మన్ గిల్(13) తక్కువ స్కోరుకే అవుటవ్వగా.. అభిషేక్ శర్మ(14) మరోసారి నిరాశపరిచాడు. 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి తడబడిన భారత్ను వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఆదుకున్నాడు. గత మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేసేందుకు శాంసన్కు అవకాశం రాలేదు. ఈ మ్యాచ్ను చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 45 బంతుల్లో 4 సిక్స్లు, ఫోర్తో 58 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్(22)తో కలిసి 65 పరుగులు జోడించాడు. ఇక, ఆఖర్లో శివమ్ దూబె(26) మెరుపులు మెరిపించడంతో స్కోరు 150 దాటింది. జింబాబ్వే 168 పరుగులతో ఛేదనకు దిగనుంది.