ఎఫ్‌ఐహెచ్ స్టార్స్ అవార్డులకు హర్మన్‌ప్రీత్, శ్రీజేశ్ నామినేట్

Update: 2024-09-17 12:14 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, మాజీ గోల్‌ కీపర్ పీఆర్ శ్రీజేశ్ మరోసారి ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(ఎఫ్‌ఐహెచ్) స్టార్స్ అవార్డుల రేసులో నిలిచారు. అవార్డుల నామినీలను ఎఫ్‌ఐహెచ్ మంగళవారం ప్రకటించింది. నిపుణుల ప్యానెల్ ఈ ఏడాది జరిగిన అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌‌ల్లో ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను అవార్డులకు నామినేట్ చేసినట్టు ఎఫ్‌ఐహెచ్ తెలిపింది.

హర్మన్‌ప్రీత్ ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో అతను 10 గోల్స్‌తో హయ్యెస్ట్ గోల్ స్కోరర్‌గా నిలిచాడు. నెదర్లాండ్స్‌కు చెందిన థియరీ బ్రింక్‌మన్, జోప్ డి మోల్, హన్నెస్ ముల్లర్(జర్మనీ), జాచ్ వాలెస్(ఇంగ్లాండ్) కూడా పోటీలో ఉన్నారు. 2019 నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు భారత ఆటగాళ్లనే వరిస్తున్నది. వరుసగా 2020-21, 2022 సీజన్లలో హర్మన్‌ప్రీత్ సింగే అవార్డు దక్కించుకున్నాడు.

మరోవైపు, పారిస్ ఒలింపిక్స్‌తో దిగ్గజ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ హాకీకి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ విశ్వక్రీడల్లో భారత్ కాంస్య పతకం సాధించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిగానూ ‘గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు నామినేట్ అయ్యాడు. వరుసగా 2020-21, 22 సీజన్లలో శ్రీజేశ్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. మూడోసారి అవార్డు రేసులో నిలిచాడు. పిర్మిన్ బ్లాక్(నెదర్లాండ్స్), లూయిస్ కాల్జాడో(స్పెయిన్), జీన్-పాల్ డన్నెబెర్గ్(జర్మనీ), టోమస్ శాంటియాగో(అర్జెంటీనా) కూడా పోటీలో ఉన్నారు. ఓటింగ్ ద్వారా విజేతలను ఎన్నుకుంటారు. నిపుణుల ప్యానెల్‌కు 40 శాతం ఓట్లు, జాతీయ అసోసియేషన్లకు 20 శాతం, అభిమానులు, ఆటగాళ్లకు 20 శాతం, మీడియాకు 20 శాతం ఓట్లు కేటాయించారు. 

Tags:    

Similar News