టీమ్ ఇండియా హెడ్ కోచ్గా అతను కన్ఫర్మ్?.. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ ఏం చెప్పాడంటే?
టీమ్ ఇండియా కొత్త హెడ్ కోచ్గా భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ నియామకం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కొత్త హెడ్ కోచ్గా భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ నియామకం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. బీసీసీఐ, గంభీర్ మధ్య ఒప్పందం కుదిరిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ తెలిపినట్టు ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. భారత ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్తో ముగియనుంది. ఇప్పటికే బీసీసీఐ కొత్త కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించగా సోమవారంతో గడువు ముగిసింది. అయితే, ఎవరు దరఖాస్తు చేసుకున్నారనే దానిపై స్పష్టత లేదు. గంభీర్ సైతం అప్లై చేశాడా?లేదా? అన్నది తెలియదు. ఐపీఎల్ ఫైనల్ తర్వాత గంభీర్తో జై షా కాసేపు మాట్లాడాడు. దీంతో హెడ్ కోచ్ గంభీరే అంటూ వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ భారత ప్రధాన కోచ్గా గంభీర్ నియామకం కన్ఫర్మ్ అయినట్టు పేర్కొంది. ‘గంభీర్ నియామకం పూర్తయ్యిందని ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమాని, బీసీసీఐ పెద్దలకు దగ్గరి వ్యక్తి చెప్పారు. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలిపారు.’ అని సదరు మీడియా సంస్థ తెలిపింది.నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ గతంలో ద్రవిడ్ గైర్హాజరులో పలుమార్లు జాతీయ జట్టుకు కోచ్గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో బోర్డు అతని వైపు మొగ్గు చూపినా.. లక్ష్మణ్కు ఆసక్తి లేదని సమాచారం. అలాగే, పలువురు విదేశీ కోచ్లు కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.దీంతో గంభీర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
గంభీర్ మెంటార్గా వ్యవహరిస్తున్న కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్-17 టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. కోల్కతా విజేతగా నిలవడంలో ద్రవిడ్ కీలక పాత్ర పోషించాడు. గతంలో అతను మెంటార్గా వ్యవహరించిన లక్నో 2022, 2023 సీజన్లలో వరుసగా ప్లే ఆఫ్స్కు చేరుకుంది. అలాగే, భారత దేశవాళీ క్రికెట్పై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని హెడ్ కోచ్గా నియమిస్తామని జై షా ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆటగాడిగా గంభీర్ అనుభవం, ఐపీఎల్లో అతను మెంటార్గా సాధించినది దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ అతన్నే ఖరారు చేయాలని భావిస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.