'మీరు చేసిన పని చాలా అసహ్యంగా ఉంది'.. సెహ్వాగ్, గవాస్కర్పై టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ ఫైర్
భారత దిగ్గజ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్లపై మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఫైర్ అయ్యారు.
దిశ, వెబ్డెస్క్: భారత దిగ్గజ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్లపై టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఫైర్ అయ్యారు. ఓ పాన్ మసాల యాడ్లో ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు నటించడాన్ని గంభీర్ తప్పుబట్టాడు. అసలు ఈ ఇద్దరూ రోల్ మోడల్సేనా? అని ప్రశ్నించాడు. మీరు చేసిన పని చాలా అసహ్యంగా ఉందని సంచలన కామెంట్స్ చేశాడు. దేశంలో కోట్ల మంది పిల్లలు చూస్తారనే ఇంగిత జ్ఞానం లేకుండా డబ్బుల కోసం ఇంతకు దిగజారాలా..? అని గంభీర్ ప్రశ్నించాడు. ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా 'కమలా పసంద్' పాన్ మసాలా సంస్థ రూపొందించిన యాడ్లో సెహ్వాగ్, గవాస్కర్లతో పాటు కపిల్ దేవ్, క్రిస్ గేల్ నటించారు.
ఇది నిజంగా అసహ్యం. దిగ్గజ ఆటగాళ్లు చేసిన ఈ పనితో తీవ్ర నిరాశకు గురయ్యాను. వీళ్లేనా మన రోల్ మోడల్స్ అనిపించింది. అందుకే రోల్ మోడల్ను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నా. మన పేరును కాకుండా మనం చేసే పనులతో జనాలు మనల్ని గౌరవిస్తారన్నారు. దేశంలో కోట్లాది మంది పిల్లలు ఈ యాడ్స్ చూస్తారు. డబ్బు కోసం ఇలాంటి పాన్ మసాలా యాడ్స్లో నటించడం అవసరమా..? అని గంభర్ తీవ్రంగా మండిపడ్డాడు. పాన్ మసాల ప్రకటనలో నటించాలని సచిన్ టెండూల్కర్కు రూ.20-30 కోట్లు ఆఫర్ చేయగా.. కానీ అలాంటి వాటిల్లో భాగస్వామి కానని ఆయన తన తండ్రికి మాటిచ్చారు. అందుకే నేను సచిన్ను రోల్ మోడల్గా ఎంచుకున్నాను. అలాంటి పెద్ద ఆఫర్ను వదులుకునేందుకు చాలా ధైర్యం కావాలి' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.