ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో అర్జెంటీనాపై భారత్ గెలుపు..
ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో ఆతిథ్య నెదర్లాండ్స్ చేతిలో ఓటమి అనంతరం భారత పురుషుల హాకీ జట్టు పుంజుకుంది.
ఐండ్హోవెన్: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో ఆతిథ్య నెదర్లాండ్స్ చేతిలో ఓటమి అనంతరం భారత పురుషుల హాకీ జట్టు పుంజుకుంది. గురువారం జరిగిన మ్యాచ్లో అర్జెంటీనాను 0-3 తేడాతో ఓడించింది. ప్రారంభంలో ఇరు జట్లు చక్కటి డిఫెన్స్ ప్రదర్శించడంతో ఫస్టాఫ్ ముగిసే సరికి ఏ జట్టూ గోల్ సాధించలేకపోయింది. ఆ తర్వాత ఎటాకింగ్ గేమ్తో దూకుడు కనబర్చిన టీమ్ ఇండియా మూడో క్వార్టర్లో రెండు గోల్స్ చేసింది. 32వ నిమిషంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి ఖాతా తెరవగా.. కాసేపటికే 38వ నిమిషంలో అమిత్ రోహిదాస్ గోల్ చేయడంతో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
మరోవైపు, అద్భుతమైన డిఫెన్స్తో అర్జెంటీనాను నిలువరించింది. ఇక, చివరి క్వార్టర్ ముగుస్తుందనగా 58వ నిమిషంలో అభిషేక్ ఫీల్డ్ గోల్ చేయడంతో 3-0 తేడాతో భారత్ గెలుపొందింది. కాగా, బుధవారం ఆతిథ్య నెదర్లాండ్స్ చేతిలో 1-4 తేడాతో టీమ్ ఇండియా ఓటమిపాలైంది. ఈ నెల 10న నెదర్లాండ్స్ను మరోసారి ఎదుర్కోనుంది. టోర్నీలో భారత్ 27 పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉన్నది.