ఆసియా గేమ్స్, వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ఎంపికైన తెలుగమ్మాయి..

షూటింగ్‌లో నిలకడగా రాణిస్తున్న తెలుగమ్మాయి ఈషా సింగ్ ఈ ఏడాది జరగబోయే ఆసియా గేమ్స్, వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ఎంపికైంది.

Update: 2023-07-02 13:52 GMT

న్యూఢిల్లీ : షూటింగ్‌లో నిలకడగా రాణిస్తున్న తెలుగమ్మాయి ఈషా సింగ్ ఈ ఏడాది జరగబోయే ఆసియా గేమ్స్, వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ఎంపికైంది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వరల్డ్ చాంపియన్‌షిప్‌‌కు 22 మందితో, ఆసియా గేమ్స్‌కు 21 మందితో భారత జట్లను ఆదివారం వేర్వేరుగా ప్రకటించింది. రెండు జట్లలోనూ ఈషా సింగ్ వ్యక్తిగత ఎయిర్ పిస్టోల్, ఎయిర్ పిస్టోల్ మిక్స్‌డ్ టీమ్‌లో చోటు దక్కించుకుంది. మిక్స్‌డ్ టీమ్‌లో శివ నర్వాల్‌తో కలిసి ఈషా సింగ్ బరిలో నిలువనుంది.

2021 జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఈషా సింగ్ రజతం సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించడం ద్వారా ఆమె 2024 పారిస్ ఒలింపిక్స్‌ బెర్త్ ఖాయం చేసుకోవాలని భావిస్తున్నది. నేషనల్ సెలెక్షన్ ట్రయల్స్, ర్యాంకింగ్స్ ఆధారంగా షూటర్లను ఎంపిక చేశారు. వరల్డ్ చాంపియన్‌షిప్‌ అజర్‌బైజాన్‌లో ఆగస్టులో జరగనున్నాయి. ఆ తర్వాత నెల వ్యవధిలోనే చైనా వేదికగా ఆసియా గేమ్స్ జరగనున్నాయి.


Similar News