Paris Olympics : క్వార్టర్స్‌లో బాక్సర్ నిశాంత్ దేవ్ ఓటమి.. జడ్జీలు చీటింగ్‌కు పాల్పడ్డారంటూ విమర్శలు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ నిశాంత్ దేవ్ పతక ఆశలు గల్లంతయ్యాయి.

Update: 2024-08-04 13:48 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ నిశాంత్ దేవ్ పతక ఆశలు గల్లంతయ్యాయి. 71 కేజీల కేటగిరీలో పోటీపడిన అతను శనివారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో మెక్సికోకు చెందిన మార్కో వెర్డె చేతిలో 4-1 చేతిలో ఓడిపోయాడు. ఆ బౌట్‌లో గెలిస్తే నిశాంత్ కనీసం కాంస్యం సాధించేవాడు. అయితే, ఆ బౌట్‌లో నిశాంతే గెలిచాడని, జడ్జీలు చీటింగ్‌కు పాల్పడ్డారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. నిశాంత్ ప్రతి రౌండ్‌లోనూ సత్తాచాటినప్పటికీ జడ్జీలు మెక్సికో బాక్సర్‌ వైపు మొగ్గు చూపడం విమర్శలకు దారితీసింది.

అసలేం జరిగిందంటే.. తొలి రౌండ్‌ను నిశాంత్ ఏకపక్షంగా గెలుచుకున్నాడు. రెండో రౌండ్‌లోనూ మెరుగ్గానే రాణించాడు. అయితే, జడ్జీలు 3-2తో మార్కో వెర్డె వైపు తీర్పు ఇచ్చారు. ఇక, డిసైడర్ మూడో రౌండ్‌లో ఐదుగురు జడ్జీలు వెర్డెకు పదేసి చొప్పున పాయింట్లు.. నిశాంత్‌కు 9 చొప్పున పాయింట్లు ఇచ్చారు. బౌట్ ముగిసిన తర్వాత నిశాంత్ విజయంపై నమ్మకంగా కనిపించాడు. కానీ, జడ్జీలు వెర్డెకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు.

దీంతో ఆ బౌట్ స్కోరింగ్ సిస్టమ్‌పై వివాదం చెలరేగింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ విజేందర్ సింగ్ జడ్జీల తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు స్కోరింగ్ సిస్టమ్ ఏమిటో తనకు అర్థం కావడం లేదని ట్వీట్ చేశాడు. బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా ఘాటుగా స్పందించాడు. ‘నిశాంత్ గెలిచాడు. ఆ స్కోరింగ్ ఎలా ఇచ్చారు?. నీ నుంచి పతకాన్ని దోచేశారు. కానీ, నువ్వు మా హృదయాలను గెలుచుకున్నావు.’ అని పోస్టు పెట్టాడు.

Tags:    

Similar News