ఆస్ట్రేలియన్ ఓపెన్లో ప్రణయ్ శుభారంభం
ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేశాడు.
దిశ, స్పోర్ట్స్ : సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్లో 5వ సీడ్గా బరిలోకి దిగిన అతను బుధవారం జరిగిన తొలి రౌండ్లో బ్రెజిల్ ఆటగాడు యోగోర్ కోయెల్హోను మట్టికరిపించాడు. 47 నిమిషాలపాటు సాగిన మ్యాచ్లో స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన ప్రణయ్ 21-10, 23-21 తేడాతో వరుసగా గేమ్ల్లో విజయం సాధించాడు. తొలి గేమ్ను అలవోకగా నెగ్గగా.. రెండో గేమ్లో గట్టి పోటీనిచ్చిన ప్రత్యర్థిని నిలువరించాడు.
యువ షట్లర్లు కిరణ్ జార్జ్, సమీర్ వర్మ కూడా రెండో రౌండ్కు చేరుకున్నారు. తొలి రౌండ్లో కిరణ్ జార్జ్ 21-17, 21-10 తేడాతో జియాడోంగ్ షెంగ్(కెనడా)పై, సమీర్ 21-10, 21-10 తేడాతో రికీ టాంగ్(ఆస్ట్రేలియా)పై విజయం సాధించారు. అభిషేక్, సుబ్రమణియన్, రవి, మిథున్ మంజునాథ్ తొలి రౌండ్లో ఓటమిపాలయ్యారు. ఉమెన్స్ సింగిల్స్లో యువ క్రీడాకారిణులు ఆకర్షి కశ్యప్, మాళవిక బాన్సోద్ శుభారంభం చేశారు. ఆకర్షి కశ్యప్ 21-14, 21-11 తేడాతో పోలినా బుహ్రోవా(ఉక్రెయిన్)పై, మాళవిక 21-10, 21-8 సహచర క్రీడాకారిణి కెయూర మోపాటిపై నెగ్గారు. మరో షట్లర్ అనుపమ ఉపాధ్యాయ 21-14, 23-21 తేడాతో వాంగ్ లింగ్ చింగ్(మలేషియా)ను ఓడించి రెండో రౌండ్కు చేరుకుంది. మిక్స్డ్ డబుల్స్లో సుమిత్-సిక్కిరెడ్డి జోడీ 21-17, 21-19 తేడాతో వాంగ్ టియన్ సి-లిమ్ చీవ్ సియెన్(మలేషియా)పై విజయం సాధించి ప్రీక్వార్టర్స్కు చేరుకుంది.