Asia Cup 2023: రోహిత్‌ శర్మ అరుదైన ఘనత.. ఆరో భారతీయ క్రికెటర్‌గా..

ఆసియా కప్‌-2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు.

Update: 2023-09-12 10:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌-2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌లో 10,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఫీట్‌ను హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ సిక్సర్‌ (285) బాది చేరుకోవడం విశేషం. వన్డే కెరీర్‌లో 241వ ఇన్నింగ్స్‌ ఆడుతున్న రోహిత్‌.. 22 పరుగుల మార్కును దాటిన తర్వాత 10,000 పరుగుల క్లబ్‌లో చేరాడు. తద్వారా సచిన్‌ (18426), విరాట్‌ (13024), గంగూలీ (11363), ద్రవిడ్‌ (10889), ధోని (10773) తర్వాత 10 వేల పరుగుల మార్కును అందుకున్న ఆరో భారతీయ క్రికెటర్‌గా, ఓవరాల్‌గా 15వ బ్యాటర్‌గా రోహిత్‌ నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. పాక్‌తో ఆడిన జట్టులో భారత్‌ ఓ మార్పు చేసింది. శార్దూల్‌ ఠాకూర్‌కు విశ్రాంతినిచ్చి, అతని స్థానంలో అక్షర్‌ పటేల్‌కు అవకాశం ఇచ్చింది. బ్యాటర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై ధాటిగానే ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌.. 9 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. 23 పరుగులతో (2 ఫోర్లు, సిక్స్‌) రోహిత్‌, 18 పరుగులతో (2 ఫోర్లు) గిల్‌ క్రీజ్‌లో ఉన్నారు.


Similar News