IND vs AUS: 'ఆడింది నాలుగు మ్యాచులే.. కోహ్లీ, రోహిత్‌కు రెస్ట్ అవసరమా?'.. లెజెండ్ ఆసక్తికర కామెంట్స్

ఆసీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి.

Update: 2023-09-23 12:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. వీళ్లిద్దరూ విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడారు. ఆ తర్వాత ఆసియా కప్ ముందు నెలరోజుల రెస్ట్ తీసుకున్నారు. ఆసియా కప్‌లో ఆడిన ఆరు మ్యాచుల్లో ఒకటి వర్షార్పణమైంది. మిగతా ఐదింట్లో రెండు మ్యాచుల్లో 10 వికెట్ల తేడాతో టీం గెలిచింది. దీంతో కోహ్లీకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. టోర్నీ ఫైనల్‌లో రోహిత్ కూడా బ్యాటింగ్ చేయలేదు. అంతలోనే ఆసీస్‌లో సిరీస్‌లో వీరికి విశ్రాంతి ఎందుకని ఫ్యాన్స్ నిలదీశారు. దీనికి భారత జట్టు మాజీ సారధి, లెజెండరీ క్రికెటర్ అంజుమ్ చోప్రా సమాధానం ఇచ్చారు. ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చేది ఆట నుంచి కాదని, వాళ్ల రొటీన్ నుంచి అని ఆమె వివరించారు. ఈ ఇద్దరు స్టార్లు రిఫ్రెష్ అయి వరల్డ్ కప్‌ను మొదలు పెడతారని అంజుమ్ అభిప్రాయపడ్డారు.

'వాళ్లేం ఇంటికెళ్లి పడుకుంటారా? మ్యాచ్ ఉంటే సిటీ నుంచి సిటీకి ప్రయాణించాలి. క్రికెట్ టీం వాతావరణంలో ట్రైనింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంటికెళ్లి వాళ్లకు కన్వీనియెంట్‌గా ఉండే ట్రైనింగ్ చేసుకుంటారు. ఉదయాన్నే త్వరగా లేచి, విమానం ఎక్కి, ప్రాక్టీస్ చేసి మ్యాచ్ ఆడే రొటీన్ నుంచి ప్లేయర్లకు విశ్రాంతి కావాలి. మ్యాచ్ ఆడితే ఎవరూ అలసిపోరు. కానీ ఈ రొటీన్ వల్ల అలసిపోతారు' అని అంజుమ్ వివరించారు. అలాగే కోహ్లీ, రోహిత్ ఇద్దరూ కూడా వన్డేల్లో 10 వేలపైగా పరుగులు చేసిన బ్యాటర్లని, ఒక రెండు మ్యాచులు ఆడకపోతే వాళ్ల ఆటతీరు చెడిపోదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ రెస్ట్ వల్ల వారిలో పరుగులు చేయాలనే ఆకలి పెరుగుతుందని ఆమె చెప్పారు. వరల్డ్ కప్‌లో హార్దిక్ పాండ్యా బెస్ట్ ఫామ్‌లో ఉండాలని, కాబట్టి అతనికి విశ్రాంతి ఇవ్వడం కూడా కరెక్టేనని ఆమె తెలిపారు.

శ్రీలంకోని ఎండ, వేడిలో హార్దిక్ బౌలింగ్ చేశాడని, అతను వరల్డ్ కప్‌లో చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. వీళ్లు లేకపోవడం వల్ల ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ వంటి వాళ్లకు వరల్డ్ కప్ ముందు మంచి ప్రాక్టీస్ దొరుకుతుందని ఆమె చెప్పుకొచ్చారు. గాయం వల్ల చాలా బ్రేక్ తర్వాత బుమ్రా ఆడుతున్నాడు కాబట్టి అతన్ని కొనసాగించాలని వివరించారు. మిగతా జట్లు కూడా ఇలాగే చేస్తున్నాయన్న ఆమె.. బంగ్లాదేశ్ ఉదాహరణ ఇచ్చారు. ఇక కోహ్లీ, రోహిత్ ఇద్దరూ కూడా సెప్టెంబర్ 27న ఆసీస్‌తో జరిగే మూడో వన్డేలో ఆడతారు. వన్డే వరల్డ్ కప్ ముందు ఇంగ్లండ్, నెదర్లాండ్స్‌తో ప్రాక్టీస్ మ్యాచులు కూడా ఆడతారు. అక్టోబర్ 8న ఆసీస్‌తో మ్యాచుతో వరల్డ్ కప్ ప్రయాణం మొదలు పెడతారు.


Similar News